భార్య కోసం బంగారం అమ్మి ఐఫోన్‌ 18 ప్రో కొన్న భర్త

భార్య కోసం బంగారం అమ్మి ఐఫోన్‌ 18 ప్రో కొన్న భర్త

iPhone 18 Pro husband sells gold to buy phone for wife
  • భారత్‌లో ఐఫోన్‌ 18 ప్రో విక్రయాల ప్రారంభం
  • ఫోన్‌ కోసం స్టోర్ల ముందు భారీ క్యూలు
  • భార్య కోసం బంగారం అమ్మిన ఢిల్లీ వ్యక్తి
  • భార్యకు బర్గండీ ఐఫోన్‌ గిఫ్ట్‌గా ఇవ్వాలని ప్లాన్‌
  • డబ్బు ఉన్నప్పుడే జీవించాలి అంటూ సమర్థన
కొత్త ఐఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చిందంటే అభిమానుల్లో ఉండే క్రేజ్‌ ఎలా ఉంటుందో మరోసారి కనిపించింది. ఐఫోన్‌ 18 ప్రో విక్రయాలు శుక్రవారం భారత్‌లో ప్రారంభం కాగా.. కొనుగోలుదారులు తెల్లవారుజాము నుంచే యాపిల్‌ స్టోర్ల ముందు బారులు తీరారు. నోయిడాలోని డీఎల్‌ఎఫ్‌ మాల్‌ ఆఫ్‌ ఇండియాలో ఉన్న యాపిల్‌ స్టోర్‌ వద్ద కూడా భారీ క్యూ కనిపించింది. అయితే అక్కడ ఓ ఢిల్లీ వ్యక్తి చేసిన పని ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

తన భార్య కోసం ఐఫోన్‌ 18 ప్రో కొనుగోలు చేసేందుకు బంగారం అమ్మినట్లు ఆ వ్యక్తి వెల్లడించాడు. తన భార్యకు బర్గండీ రంగు ఐఫోన్‌ కావాలని చెప్పిందని, ఆమె ఇప్పటివరకు ఐఫోన్‌ వాడలేదని తెలిపాడు. అందుకే ఆమెకు కొత్త ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.

‘‘గతంలో డబ్బు లేదు.. ఇప్పుడు ఉంది. భవిష్యత్తులో ఉంటుందో లేదో తెలియదు. ప్రస్తుతం ఉన్న డబ్బుతో ఇప్పుడే జీవించాలి’’ అంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. చివరకు ఐఫోన్‌ కొనుగోలు కోసం బంగారం విక్రయించినట్లు చెప్పాడు.

మరోవైపు పంజాబ్‌కు చెందిన గుర్దితా సింగ్‌ తన కాబోయే భార్యకు గిఫ్ట్‌గా ఐఫోన్‌ 18 ప్రో కొనుగోలు చేసేందుకు నోయిడాకు వచ్చాడు. తన కోసం ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌ కూడా కొనుగోలు చేశాడు. రెండు ఫోన్ల కోసం రూ.3.5 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపాడు. తెల్లవారుజామున 6 గంటల నుంచే స్టోర్‌ ముందు వేచి ఉన్నాడు.

కొంతమంది దంపతులు తమ కోసం రెండు ఐఫోన్‌ 18 ప్రో ఫోన్లు కొనుగోలు చేశారు. ధర పెరిగినా ఐఫోన్‌ అభిమానులు కొనుగోలు చేస్తారని ఓ మహిళ చెప్పింది. విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు కూడా ఫోన్‌ కోసం క్యూ కట్టారు. కొందరు ఏకంగా సెలవు పెట్టుకుని వచ్చారు.

అయితే ప్రీ-ఆర్డర్‌ చేయని వారికి ఆ రోజు ఫోన్‌ కొనుగోలు చేసే అవకాశం లభించలేదు. దీంతో కొందరు నిరాశతో వెనుదిరిగారు.
Advertisement
iPhone 18 Pro
Apple Store Noida
DLF Mall of India
iPhone 18 Pro India price
Husband sells gold for iPhone
Gurditta Singh

More Telugu News