నిజామాబాద్ పోలీస్ హెడ్క్వార్టర్స్లో తీవ్ర విషాదం: రివాల్వర్ మిస్ఫైర్ అయి ఆర్ఐ సతీశ్ మృతి
- ఉదయం విధులు ముగించుకున్న ఆర్ఐ సతీశ్
- రివాల్వర్ను శుభ్రం చేసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ
- అక్కడిక్కడే మృతి చెందిన సతీశ్
నిజామాబాద్ జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఈ ఉదయం తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. విధులు ముగించుకుని తన సర్వీస్ రివాల్వర్ను శుభ్రం చేసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో రిజర్వ్ ఇన్స్పెక్టర్ హెచ్. సతీశ్ అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసు వర్గాలు అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం... ఆర్ఐ సతీశ్ తన విధులు పూర్తి చేసుకున్న అనంతరం హెడ్క్వార్టర్స్లో తన సర్వీస్ ఆయుధాన్ని శుభ్రం చేసే క్రమంలో ఈ దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
నిజాయతీగల అధికారిగా పేరుపొందిన ఆర్ఐ సతీశ్ మృతి చెందడంతో జిల్లా పోలీసు శాఖ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకోగా, సహచర అధికారులు, సిబ్బంది ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.