ప్ర‌భుత్వం కీలక నిర్ణయం.. ఏపీలో స్పోర్ట్స్ కోటాలో నకిలీలకు చెక్

ప్ర‌భుత్వం కీలక నిర్ణయం.. ఏపీలో స్పోర్ట్స్ కోటాలో నకిలీలకు చెక్

AP Government key decision to curb fake sports certificates in sports quota
  • స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు, అడ్మిషన్లకు కొత్త నిబంధన
  • సర్టిఫికెట్లతో పాటు స్కిల్ టెస్ట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి
  • నకిలీ సర్టిఫికెట్లతో ప్రయోజనం పొందకుండా అడ్డుకట్ట
  • నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో నైపుణ్య పరీక్షల నిర్వహణ
  • సాంఘిక సంక్షేమ, రవాణా శాఖల్లోనూ సర్వీసు నిబంధనల సవరణ
ఏపీ ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి ఒక కీలకమైన, సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం క్రీడా సర్టిఫికెట్లు ఉంటే సరిపోదని, వాటితో పాటు అభ్యర్థులు తప్పనిసరిగా నైపుణ్య పరీక్ష (స్కిల్ టెస్ట్)లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 

నిజమైన ప్రతిభ ఉన్న క్రీడాకారులకు న్యాయం చేసేందుకు, నకిలీ సర్టిఫికెట్ల ద్వారా అనర్హులు లబ్ధి పొందకుండా అడ్డుకట్ట వేసేందుకే ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

నూతన నిబంధనల ప్రకారం.. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం లేదా అడ్మిషన్ ఆశించే అభ్యర్థులు రాత పరీక్షలో అర్హత సాధించడంతో పాటు, ఈ స్కిల్ టెస్ట్‌లో కూడా తప్పనిసరిగా పాస్ కావాలి. అభ్యర్థులు ఏ క్రీడకు సంబంధించిన సర్టిఫికెట్లు సమర్పించారో, అదే క్రీడలో వారి నైపుణ్యాన్ని క్షేత్రస్థాయిలో పరీక్షిస్తారు. 

ఈ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు స్పోర్ట్స్ టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్, ఫిజికల్ డైరెక్టర్లు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) అధికారులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ అభ్యర్థి క్రీడా నైపుణ్యాన్ని, స్థాయిని అంచనా వేసి అర్హతను నిర్ధారిస్తుంది. ఈ మేరకు అవసరమైన కార్యాచరణను శాప్ సిద్ధం చేస్తోంది.

రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ఈ కొత్త విధానం వర్తిస్తుంది. ఈ నిర్ణయంతో కేవలం సర్టిఫికెట్లను అడ్డం పెట్టుకుని ఉద్యోగాలు, సీట్లు పొందే అవకాశం ఉండదని, క్షేత్రస్థాయిలో ప్రతిభ ఉన్న వారికే మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి విధివిధానాలతో త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

ఇతర శాఖల్లోనూ నిబంధనల సవరణ
ఇదే క్రమంలో ప్రభుత్వం పలు ఇతర శాఖల్లోని సర్వీసు నిబంధనలను కూడా సవరించింది. సాంఘిక సంక్షేమ శాఖలో 1996 నాటి సర్వీసు రూల్స్‌ను రాష్ట్రపతి ఉత్తర్వులు-2025కు అనుగుణంగా మార్పులు చేసింది. దీని ప్రకారం అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ఏఎస్‌డబ్ల్యూవో) పోస్టును గెజిటెడ్ కేటగిరీగా చేర్చారు. 

అలాగే, వార్డెన్/మేట్రన్ గ్రేడ్-1, గ్రేడ్-2 పోస్టుల పేర్లను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, గ్రేడ్-2గా మార్చారు. వీటితో పాటు రవాణా శాఖ సబార్డినేట్ సర్వీసు నిబంధనలు-2009కి కూడా సవరణలు చేశారు. పదోన్నతి పొందాలంటే కింది స్థాయి క్యాడర్‌లో కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలనే నిబంధనను కొత్తగా చేర్చారు.
Advertisement
AP Government
Sports Quota Skill Test
Fake Sports Certificates
SAAP Andhra Pradesh
Government Jobs AP
Sports Quota Admissions

More Telugu News