ఐఆర్‌సీటీసీ ఆల్ టైమ్ రికార్డ్.. ఒక్కరోజే 20 లక్షలకు పైగా టికెట్ల బుకింగ్!

ఐఆర్‌సీటీసీ ఆల్ టైమ్ రికార్డ్.. ఒక్కరోజే 20 లక్షలకు పైగా టికెట్ల బుకింగ్!

IRCTC All Time Record Over 20 Lakh Tickets Booked in a Single Day
  • పండుగల సీజన్‌లో ఐఆర్‌సీటీసీ ఆల్ టైమ్ రికార్డు
  • ఒక్కరోజే 20 లక్షలకు పైగా రైలు టికెట్ల బుకింగ్
  • సామర్థ్యాన్ని రెట్టింపు చేసిన కొత్త సర్వర్లు, వెబ్‌సైట్
  • బాట్‌లు, మోసపూరిత బుకింగ్‌లపై ఉక్కుపాదం
  • 3 కోట్లకు పైగా ఫేక్ యూజర్ ఐడీల డియాక్టివేషన్
పండుగల సీజన్ సమీపిస్తుండటంతో రైలు టికెట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తన చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ నెల‌ 7వ తేదీన ఒక్కరోజే 20 లక్షలకు పైగా టికెట్లను బుక్ చేసి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. ఐఆర్‌సీటీసీ చరిత్రలో రోజువారీ బుకింగ్‌ల సంఖ్య 20 లక్షల మార్కును దాటడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఐఆర్‌సీటీసీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 7న ఒకేరోజులో మొత్తం 20,06,353 టికెట్లు బుక్ అయ్యాయి. ఆ మరుసటి రోజు, సెప్టెంబర్ 8న కూడా రద్దీ కొనసాగి, 19,50,699 టికెట్లు బుక్ అయ్యాయి. గతేడాది పండుగ సీజన్‌లో నమోదైన అత్యధిక సింగిల్-డే బుకింగ్ (18,40,203) కంటే ఇది 6 శాతం అధికం. ప్రస్తుతం రైల్వే రిజర్వ్‌డ్ టికెట్లలో దాదాపు 89 శాతం ఆన్‌లైన్‌లోనే బుక్ అవుతున్నాయని, ఈ భారీ ట్రాఫిక్‌ను తట్టుకునేలా సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేశామని ఐఆర్‌సీటీసీ తెలిపింది.

భారీగా పెరిగిన ఈ ట్రాఫిక్‌ను సమర్థంగా నిర్వహించేందుకు ఐఆర్‌సీటీసీ ఇటీవల కీలక మార్పులు చేసింది. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థ సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేస్తూ కొత్త సర్వర్లను ఏర్పాటు చేసింది. అంతేగాక 2026 జులై 15న సరికొత్త వెబ్‌సైట్, యూజర్ ఇంటర్‌ఫేస్‌ను ప్రారంభించింది. ఈ కొత్త వెబ్‌సైట్‌లో ప్రయాణికులు వివిధ తరగతుల్లో సీట్ల లభ్యతను ఒకే స్క్రీన్‌పై చూసుకునే వెసులుబాటు కల్పించారు.

సాంకేతిక అప్‌గ్రేడ్‌లతో పాటు మోసపూరిత బుకింగ్‌లు, బాట్‌ల వాడకంపై ఐఆర్‌సీటీసీ ఉక్కుపాదం మోపింది. ఇందుకోసం ప్రవేశపెట్టిన యాంటీ-బాట్ సిస్టమ్ ద్వారా అనుమానాస్పద బాట్ ట్రాఫిక్‌ను 55-65 శాతం తగ్గించగలిగినట్లు సంస్థ వెల్లడించింది. అలాగే, బుకింగ్ విండో తెరుచుకున్న మొదటి 10 నిమిషాల పాటు (ఉదయం 8 నుంచి 8:10 వరకు) అధీకృత ఏజెంట్లు టికెట్లు బుక్ చేయకుండా నిబంధన విధించింది. రిజర్వేషన్ విండో ఓపెన్ అయినప్పుడు టికెట్లు బుక్ చేసే యూజర్లకు ఆధార్ వెరిఫికేషన్‌ను కూడా తప్పనిసరి చేసింది. 

ఈ చర్యల్లో భాగంగా మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న 3.04 కోట్ల యూజర్ ఐడీలను డియాక్టివేట్ చేసినట్లు, మరో 6.33 కోట్ల ఐడీలను రీ-వెరిఫికేషన్ కోసం ఫ్లాగ్ చేసినట్లు ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. ఇంత భారీ స్థాయిలో రికార్డు బుకింగ్‌లు జరిగినప్పటికీ, కొత్త ఆన్‌లైన్ వ్యవస్థలో ఎటువంటి పెద్ద అంతరాయాలు కలగలేదని పేర్కొంది.
Advertisement
IRCTC
Indian Railways
Train Ticket Booking Record
Online Railway Reservation
Festival Season Travel
IRCTC Technical Upgrade

More Telugu News