Advertisement

మీకు మార్కులు తగ్గితే లోకేశ్‌కు మార్కులు తగ్గినట్టే: రంపచోడవరంలో చంద్రబాబు

Chandrababu Naidu says if students marks decrease then Lokesh marks decrease in Rampachodavaram
  • రంపచోడవరంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి
  • 'డ్రగ్స్ వద్దు బ్రో' హ్యాండ్‌బుక్, 'బడి కోసం' డోనర్ వెబ్ పోర్టల్ ఆవిష్కరణ
  • ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని వెల్లడి
  • గత ప్రభుత్వ అప్పులను తీరుస్తూనే సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తున్నామని స్పష్టీకరణ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మార్కులు తగ్గితే, అది విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు మార్కులు తగ్గినట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. లోకేశ్ ఏరికోరి విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించారని, విద్యారంగంపై ఆయనకున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు. విద్యారంగంలో మార్పు తీసుకురావాలన్న తపనతో ఆయన పనిచేస్తున్నారని, ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో కనిపిస్తున్న మార్పులు చూస్తుంటే ఆనందంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన 'మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్' (PTM) సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. "కొత్త జిల్లా ఏర్పాటయ్యాక తొలిసారి ఇక్కడికి వచ్చాను. ఇవాళ నేను కూడా టీచర్‌ను అయ్యాను, నేర్చుకోవడానికి విద్యార్థిని అయ్యాను, తల్లిదండ్రులకు చెప్పడానికి మెంటర్‌గా మారాను" అని అన్నారు. పిల్లల భవిష్యత్తు బాధ్యతను తల్లిదండ్రులిద్దరూ తీసుకోవాలని, అప్పుడే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని హితవు పలికారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మార్పులు ప్రారంభమయ్యాయని, దీని ఫలితంగానే ప్రైవేట్ పాఠశాలల నుంచి 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారని, ఇదే ప్రభుత్వ స్కూళ్ల సత్తా అని గర్వంగా ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లోని పిల్లలు మట్టిలో మాణిక్యాలని, వారికి అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

'బడి కోసం' పోర్టల్ ఆవిష్కరణ.. వెల్లువెత్తిన విరాళాలు

ఈ కార్యక్రమంలో భాగంగా, పాఠశాల విద్యాశాఖ రూపొందించిన 'డ్రగ్స్ వద్దు బ్రో' హ్యాండ్‌బుక్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన 'బడి కోసం' డోనర్ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. పోర్టల్ ప్రారంభించిన వెంటనే రంపచోడవరం హైస్కూల్‌కు మీ-సేవ ఆపరేటర్ చిట్టిబోయిన ఉదయ్ కుమార్ లక్ష రూపాయల విరాళం ప్రకటించగా, నెల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలకు పారిశ్రామికవేత్త పూర్ణచంద్రరావు రూ.4 కోట్లు విరాళం ప్రకటించడం సభలో హర్షాతిరేకాలు నింపింది.

ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ పాలన

రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, మనసుంది కాబట్టే 'తల్లికి వందనం' వంటి పథకాలను అమలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసిందని, ప్రభుత్వ ఆస్తులను సైతం తాకట్టు పెట్టిందని విమర్శించారు. తాము ఆ ఆస్తులను విడిపిస్తూ, అధిక వడ్డీల భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నుంచి, ప్రస్తుతం ప్రతినెలా ఒకటో తేదీన ఠంఛనుగా జీతాలు, పెన్షన్లు ఇస్తున్నామని గుర్తుచేశారు. ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే, సంక్షేమం-అభివృద్ధిని సమన్వయం చేస్తున్నామన్నారు.

ఉపాధ్యాయుల సంక్షేమం, యువతకు భవిష్యత్

ఉపాధ్యాయులకు సముచిత గౌరవం ఇస్తున్నామని, పారదర్శక కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. గత ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ నిర్వహించని గత ప్రభుత్వానికి భిన్నంగా, తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీని పూర్తిచేశామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో నియమితులైన కొత్త ఉపాధ్యాయులను అభినందించారు. విశాఖకు గూగుల్ వంటి సంస్థలను తీసుకువస్తున్నామని, ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన జరుగుతుందని వెల్లడించారు. విద్యార్థులు ఇష్టపడి చదివితే, రాష్ట్రంలోనే పెద్ద ఉద్యోగాలు కల్పించే బాధ్యత తమదని భరోసా ఇచ్చారు.

అనంతరం గంజాయి సాగును నిర్మూలించి ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తామని, జీవో నెంబర్-3పై చర్చించి గిరిజనులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Nara Lokesh
Andhra Pradesh Education
Mega PTM Rampachodavaram
Badi Kosam Portal
Mega DSC Andhra Pradesh

More Telugu News