Advertisement

రాజస్థాన్ వీడటం పెద్ద రిస్క్.. ధోనీ ఒక్క మాటతో అంతా మారింది: సంజూ శాంసన్

Sanju Samson says leaving Rajasthan was a big risk but one word from Dhoni changed everything
  • 11 ఏళ్ల తర్వాత ఆర్ఆర్‌ను వీడటం ఓ భారీ రిస్క్ అని చెప్పిన సంజూ 
  • సీఎస్‌కేలో చేరాక కొత్త ఉత్సాహం, శక్తి లభించాయని వెల్లడి
  • ఆరంభంలో విఫలమైనప్పుడు ధోనీ ఇచ్చిన చిన్న సలహా అద్భుతంగా పనిచేసిందన్న కీపర్
  • కెప్టెన్సీ కోసం వెంపర్లాడనని, రుతురాజ్ నాయకత్వంలో ఆడటానికి సిద్ధపడ్డానని స్పష్టీకరణ
  • జట్టుకు అవసరమైనప్పుడు పిలుస్తారనే నమ్మకంతో ఉంటానని వ్యాఖ్య
టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్ తన ఐపీఎల్ కెరీర్‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నాడు. 11 ఏళ్ల పాటు సుదీర్ఘ అనుబంధం ఉన్న రాజస్థాన్ రాయల్స్‌ను వీడటం ఒక భారీ రిస్క్ అని, అయితే చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరడం వల్ల తనలో కొత్త శక్తి పుట్టుకొచ్చిందని అన్నాడు. జియోస్టార్ 'సూపర్ స్టార్స్' కార్యక్రమంలో మాట్లాడుతూ సంజూ ఈ ఆసక్తికర విషయాలను వెల్ల‌డించాడు.

రాజస్థాన్ రాయల్స్‌తో తన బంధంపై సంజూ మాట్లాడుతూ.. "రాజస్థాన్ రాయల్స్‌ను వీడటం చాలా పెద్ద రిస్క్. ఒకసారి ఫ్రాంచైజీకి మీ మనసులో మాట చెప్పాక, వెనక్కి వెళ్లే మార్గం ఉండదు. ఈ నిర్ణయం వెనుక రెండు కారణాలున్నాయి. మొదటిది, 2025 సీజనే ఆర్ఆర్‌తో నాకు చివరిదని నేను నిశ్చయించుకున్నా. నా కుటుంబం, నా భార్యతో సుదీర్ఘంగా చర్చించాను. ఇది ఆవేశపూరిత నిర్ణయమా? అని వాళ్లు అడిగారు. కానీ రెండు, మూడు వారాల చర్చల తర్వాత.. ఇదే సరైన సమయమని నిర్ణయించుకున్నా. 

రెండోది, నాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. సున్నా నుంచి మళ్లీ ప్రారంభించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. చెపాక్ లాంటి నెమ్మదైన వికెట్‌పై నా బ్యాటింగ్ శైలి సరిపోదని చాలామంది అన్నారు. కానీ, 'నీకు 30 ఏళ్లు. ఏదో ఒక మార్గం కనుక్కో' అని నాకు నేను చెప్పుకున్నాను. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఏదో సాధించాలనే పట్టుదలతో, కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగాను" అని వివరించాడు.

ధోనీ సలహా.. మారిన తలరాత
2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌'గా నిలిచినప్పటికీ, సీఎస్‌కే తరఫున ఆడిన మొదటి మూడు మ్యాచ్ లలో సంజూ విఫలమయ్యాడు. ఆ సమయంలో జట్టు యాజమాన్యం నుంచి లభించిన మద్దతు, ముఖ్యంగా ఎంఎస్ ధోనీ ఇచ్చిన సలహా తనను ఎలా మార్చిందో సంజూ గుర్తుచేసుకున్నాడు.

"టీ20 క్రికెట్‌లో వైఫల్యాలు సహజం. నేను సీఎస్‌కేలో చేరినప్పుడు మొదటి మూడు మ్యాచ్ లలో విఫలమయ్యాను. మేం ఆ మూడు మ్యాచ్ లూ ఓడిపోయాం. ప్రపంచకప్ ఫైనల్ ఆడిన ఫామ్‌ను కొనసాగించలేకపోయాను. అలాంటి స్థితిలో కోచ్, కెప్టెన్, మహీ భాయ్ అందరూ మనవైపే చూస్తారని తెలుసు. అయితే, జట్టు యాజమాన్యం, సహచరుల నుంచి నా పట్ల స్పందనలో ఒక్క శాతం కూడా మార్పు రాలేదు. నాపై వారి నమ్మకం తగ్గలేదు. అది నాకు చాలా బలాన్నిచ్చింది. 

ప్రాక్టీస్ సెషన్‌లో మహీ భాయ్ నా దగ్గరకు వచ్చి 'బాగున్నావా?' అని అడిగారు. నేను 'ఫైన్ భయ్యా' అన్నాను. కానీ, నా సమాధానంలో 'కానీ, అయితే' లాంటి మాటలు దొర్లాయి. అది గమనించిన ధోనీ, 'అయితే, కానీ అనే ఆలోచనల్లోకి వెళ్లకు. నీకు ఏది ఉత్తమంగా వచ్చో దానిపైనే దృష్టి పెట్టు. అంతా సర్దుకుంటుంది' అని చాలా సింపుల్‌గా చెప్పాడు. అది నాకు పెద్ద పాఠంలా పనిచేసింది. ఆ తర్వాతి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సెంచరీ చేశా. అక్కడి నుంచి ఊపందుకున్నా" అని సంజూ తెలిపాడు.

కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు
రాజస్థాన్ రాయల్స్‌కు ఐదేళ్లు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, సీఎస్‌కేలో ఆ బాధ్యతలు ఎందుకు కోరుకోలేదో కూడా సంజూ స్పష్టం చేశాడు. "కెప్టెన్సీ అనేది అడిగి తీసుకునేది కాదు. మీరు సరైన వ్యక్తి అని నమ్మి వాళ్లు ఇవ్వాలి. రాజస్థాన్‌లోనూ నేను కెప్టెన్సీ అడగలేదు. కానీ ఇప్పుడు ఆ బాధ్యతను వదిలి, నా ఆటను ఆస్వాదించాలని నిర్ణయించుకున్నా. రుతురాజ్ కెప్టెన్సీలో ఆడటం నాకు ఇష్టమే. అందుకే కెప్టెన్సీ కోసం నేను డిమాండ్ చేయలేదు" అని శాంసన్ పేర్కొన్నాడు. 

జాతీయ జట్టుకు ఎంపిక కావడంపై మాట్లాడుతూ.. "భారత జట్టుకు నేను అవసరమని భావిస్తే, నన్ను పిలుస్తారు. దానికోసం నేను ఆరెంజ్ క్యాప్ గెలవాల్సిన పనిలేదు. 'భయ్యా, నన్ను సెలెక్ట్ చేయండి' అని నేను అడగను. 'నేను ఇక్కడే ఉన్నాను, మీకు కావాలంటే పిలవండి' అనే రకం నేను" అని తన వైఖరిని స్పష్టం చేశాడు.
Advertisement
Sanju Samson
Chennai Super Kings
MS Dhoni
Rajasthan Royals
IPL 2025
Sanju Samson CSK Century

More Telugu News