అసత్య ప్రచారం ఆపండి: జగన్ కు మంత్రి సత్యకుమార్ లేఖ
- మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై దుష్ప్రచారం ఆపాలని డిమాండ్
- 17 కాలేజీల పేరుతో వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందని ఆరోపణ
- రూ. 8,480 కోట్ల ప్రతిపాదనలకు, చెల్లించింది రూ. 1,451 కోట్లేనని వెల్లడి
పీపీపీ విధానానికి, ప్రైవేటీకరణకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను పునరావృతం చేయకూడదన్న ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ఎంచుకుందని తెలిపారు. "మీరు చేయలేని పనుల గురించి కూడా గొప్పలు చెప్పుకోవడం దారుణం. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి, మెడికల్ కాలేజీలపై తప్పుడు ప్రచారానికి స్వస్తి పలకాలి" అని వ్యాఖ్యానించారు.
గత వైసీపీ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు నిర్మించామని చెప్పుకోవడం పూర్తిగా అవాస్తవమని సత్యకుమార్ ఆరోపించారు. రూ. 8,480 కోట్ల అంచనాలతో 17 కాలేజీలను ప్రతిపాదించినా, కేవలం రూ. 1,451 కోట్ల విలువైన బిల్లులు మాత్రమే చెల్లించారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, వైసీపీ హయాంలో నిర్మించిన కాలేజీల్లో కనీసం అడ్మిషన్లు కూడా సాధించలేకపోయారని విమర్శించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియపై దృష్టి సారించిందని మంత్రి వివరించారు. ఈ అంశంపై తాను ఇచ్చిన వివరణకు జగన్ స్పందించాలని ఆయన సవాల్ విసిరారు.