పశ్చిమ బెంగాల్లో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
- దుర్గాపూర్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
- వారిలో ఇద్దరు ప్రధాన నిందితులు, ఒక మహిళ, హోటల్ మేనేజర్
- పరిచయం ఉన్న మహిళ ద్వారా మాయమాటలతో బాలిక ట్రాప్
- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని
- నిందితులను ఎన్కౌంటర్ చేయాలన్న బీజేపీ నేత
ఈ కేసుకు సంబంధించిన సంచలన వివరాలు బయటకు వచ్చాయి. శనివారం (7వ తేదీ) మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో బాధితురాలి కుటుంబానికి తెలిసిన సిమ్రాన్ తమాంగ్ అనే మహిళ.. బాలికను మాయమాటలతో నమ్మించి ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చింది. ఆ తర్వాత నిందితులు బాలికను కారులో ఎక్కించుకుని, అందులోనే బలవంతంగా కూల్ డ్రింక్లో మత్తుమందు, మద్యం కలిపి తాగించారు. బాలిక స్పృహ కోల్పోగానే కవిగురు ప్రాంతంలోని ఒక హోటల్కు తీసుకెళ్లి రాజ్ మల్లిక్, షేక్ అజారుద్దీన్తోపాటు మరికొందరు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత బాలిక తండ్రి ఆరోపించారు.
రోడ్డుపై పడేసి పరారైన దుండగులు
ఈ ఘాతుకం తర్వాత శనివారం రాత్రి 10:30 గంటల సమయంలో నిందితులు బాలికను బైపాస్ రోడ్డు పక్కన పడేసి పారిపోయారు. తీవ్ర అస్వస్థతతో రోడ్డుపై పడి ఉన్న బాలికను ఒక ఈ-రిక్షా డ్రైవర్ గుర్తించి, మానవత్వంతో ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చాడు. బాధితురాలి పరిస్థితిని చూసి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే బిధాననగర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది.
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలాన్ని, హోటల్ను సందర్శించి ఆధారాలు సేకరించింది. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు, బాలికను హోటల్కు తీసుకెళ్లిన మహిళ, హోటల్ మేనేజర్ను అరెస్ట్ చేసినట్లు అసన్సోల్-దుర్గాపూర్ పోలీస్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.
నిందితులను ఎన్కౌంటర్ చేయాలి: బీజేపీ నేత డిమాండ్
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆసుపత్రికి వెళ్లి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నేత పరిజాత్ గంగూలీ, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. "ప్రధాన సూత్రధారి సిమ్రాన్ తమాంగ్తో పాటు రాజ్ మల్లిక్, షేక్ అజారుద్దీన్ చేసిన పని క్షమించరానిది. ఇలాంటి రేపిస్టులకు జైల్లో భోజనం పెట్టవద్దు. ఉదయం అరెస్ట్ చేస్తే, సాయంత్రానికల్లా వారిని ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడే నేరగాళ్లలో భయం పుడుతుంది" అని పేర్కొన్నారు. అయితే, పోలీసులు తమ పని తాము చేస్తున్నారని, ముఖ్యమంత్రి వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని, తమకు వ్యవస్థపై నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.