విదేశీ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలు కావద్దు.. భారత యువతకు నితిన్ నబిన్ పిలుపు!

Nitin Nabin calls Indian youth not to be puppets of foreign powers
  • భారతీయ యువత ఎవరి మాటలకు లొంగబోదన్న నితిన్ నబిన్
  • యవతను ప్రభావితం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని విమర్శలు
  • దేశ పురోగతి యువత కష్టపడే తత్వంపైనే ఆధారపడి ఉందన్న  బీజేపీ చీఫ్ 
  • దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపు
భారత యువత విదేశాల్లో కూర్చున్న కొందరు వ్యక్తుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిందని, వారు ఎవరి మాటలకూ లొంగరని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పేర్కొన్నారు. ప్రతికూల రాజకీయాలకు యువత  దూరంగా ఉంటూ, సానుకూల దృక్పథంతో దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నీట్-యూజీ (NEET-UG), సీబీఎస్‌ఈ (CBSE) పరీక్షల్లో జరిగిన అక్రమాలపై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించిన భారీ నిరసనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఝార్ఖండ్ రాజధాని రాంచీలో శనివారం జరిగిన 'మేధావుల సదస్సు' (Intellectuals Meet)లో నితిన్ నబిన్ ప్రసంగించారు. విదేశీ గడ్డపై నుంచి డిజిటల్ క్యాంపెయిన్ల ద్వారా భారతీయ యువతను ప్రభావితం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. "విదేశాల్లో కూర్చుని తామే భారత యువతకు దిశా నిర్దేశం చేయగలమని, వారిని కీలుబొమ్మలుగా మార్చవచ్చని కొందరు భావిస్తున్నారు. కానీ, భారత యువత గ్రామాల్లోని రైతుల మధ్య, కోచింగ్ సెంటర్లలో, కాలేజీ క్యాంపస్‌లలో నివసిస్తున్నారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం వారు కీలుబొమ్మలుగా మారడానికి సిద్ధంగా లేరు" అని ఆయన ఉద్ఘాటించారు.

ప్రజాస్వామ్య నిరసనలు ఒకే.. కానీ..
దేశ పురోగతి యువత కష్టపడే తత్వంపైనే ఆధారపడి ఉందన్న నబిన్.. వారిని ప్రతికూల రాజకీయాల్లోకి లాగాలని చూస్తున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉందని, అయితే ప్రజాస్వామ్య ప్రమాణాలను కాలరాసే ప్రయత్నాలను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికలను దేశాభివృద్ధికి ఉపయోగించాలి తప్ప, సమాజంలో అలజడులు సృష్టించడానికి కాదని హితవు పలికారు.

అమెరికా నుంచి తిరిగి వచ్చిన పొలిటికల్ సెటైరిస్ట్ అభిజీత్ దిప్కే స్థాపించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP)కి సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమం జరిగింది. పరీక్షల అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనల వేడి దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసిన తరుణంలో.. బీజేపీ జాతీయ అధ్యక్షుడి వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.
Go Back to Shorts
Nitin Nabin
Indian Youth
Foreign Powers
BJP
Cockroach Janata Party
Abhijit Dipke
NEET UG Irregularities
CBSE Exam Controversy
Digital Campaigns
Ranchi Intellectuals Meet

More Telugu News