చరిత్రను ఎవరూ దాచిపెట్టలేరు: రేవంత్రెడ్డిపై కిషన్ రెడ్డి ఫైర్
- తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి
- రజాకార్ల ఘోరాలను గత పాలకులు తొక్కిపెట్టారని మండిపాటు
- ఎంఐఎంకు అనుకూలంగా రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని విమర్శ
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై విరుచుకుపడ్డారు.
తెలంగాణలో రజాకార్లు జరిపిన నరమేధం, ఘోరాలను గత పాలకులు చరిత్ర పుటల నుంచి తొక్కిపెట్టారని మండిపడ్డారు. చరిత్రను ఎంత దాచాలని చూసినా సత్యం దాగిపోదని స్పష్టం చేశారు. ఎంఐఎంకు భయపడే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి వెనుకాడాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎంఐఎంకు అనుకూలంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
అసెంబ్లీ సాక్షిగా నిజాం పాలకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొగడటాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. "నిజాం నిజంగానే మంచివాడైతే తెలంగాణ విమోచన కోసం సాయుధ పోరాటాలు ఎందుకు చేయాల్సి వచ్చింది? 'ఆపరేషన్ పోలో' ఎందుకు చేపట్టాల్సి వచ్చింది?" అని నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఈ తరహా ఓటు బ్యాంక్ రాజకీయాలకు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.