యూపీఐపై ఎండీఆర్‌ సూచించిన కమిటీలో కాంగ్రెస్‌ ఎంపీలూ ఉన్నారు: బీజేపీ

యూపీఐపై ఎండీఆర్‌ సూచించిన కమిటీలో కాంగ్రెస్‌ ఎంపీలూ ఉన్నారు: బీజేపీ

BJP claims Congress MPs were part of committee that recommended UPI MDR
  • యూపీఐ ఎండీఆర్‌పై రాహుల్‌ గాంధీ విమర్శలు
  • పాత కమిటీ సిఫారసును ప్రస్తావించిన బీజేపీ
  • కమిటీలో ఐదుగురు కాంగ్రెస్‌ ఎంపీలు ఉన్నారని వెల్లడి
  • అధిక విలువ లావాదేవీలకు ఎండీఆర్‌ను కమిటీ సూచించినట్లు వెల్లడి
  • కాంగ్రెస్‌ ఎంపీలు అభ్యంతరం చెప్పలేదన్న బీజేపీ
యూపీఐ లావాదేవీలపై ‘మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌’ (ఎండీఆర్‌) విధించే కేంద్రం నిర్ణయంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేస్తున్న వేళ.. పార్లమెంటరీ ఆర్థిక వ్యవహారాల కమిటీ గతంలో చేసిన సిఫారసులను బీజేపీ ప్రస్తావించింది. ఆ కమిటీలో ఉన్న ఐదుగురు కాంగ్రెస్‌ ఎంపీలు ఆగస్టు 12న నివేదిక ఆమోదం పొందినప్పుడు సమావేశానికి హాజరయ్యారని, ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. 

కమిటీలో మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం, మనీశ్‌ తివారీ, గౌరవ్‌ గొగోయ్‌, కిశోరీ లాల్‌, కే.గోపీనాథ్‌ ఉన్నారు. యూపీఐ వ్యవస్థకు స్థిరమైన ఆదాయ మార్గం అవసరమని కమిటీ తన నివేదికలో పేర్కొంది. అధిక విలువ కలిగిన లావాదేవీలకు దశలవారీగా ఎండీఆర్‌ అమలు చేసే విధానాన్ని సూచించింది.

కమిటీ లెక్కల ప్రకారం.. యూపీఐ వ్యవస్థకు ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్‌ రూ.2,000 కోట్లుగా ఉంది. పరిశ్రమ అంచనా వేసిన నిర్వహణ వ్యయం మాత్రం రూ.20,700 కోట్లుగా ఉంది. ఈ అంతరాన్ని పూడ్చేందుకు స్థిరమైన ఆదాయ వ్యవస్థ అవసరమని కమిటీ పేర్కొంది. లేకపోతే సైబర్‌ భద్రత, మోసాల నివారణ, నెట్‌వర్క్‌ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులకు ఇబ్బందులు రావొచ్చని తెలిపింది. 

రూ.2,000కు మించిన వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ విధించే విధానాన్ని అక్టోబరు 15 నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే లావాదేవీలకు ఈ ఛార్జీ వర్తించదు. చిన్న మొత్తాల చెల్లింపులకు కూడా మినహాయింపులు ఉన్నాయి. 

రాహుల్‌ గాంధీ మాత్రం ఈ విధానాన్ని ‘యూపీఐ ట్యాక్స్‌’గా అభివర్ణిస్తూ వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఛార్జీ వినియోగదారులపై పడే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వాదిస్తోంది. ఎండీఆర్‌ పన్ను కాదని, వినియోగదారులపై నేరుగా భారం పడకుండా చర్యలు తీసుకున్నామని కేంద్రం చెబుతోంది.
Advertisement
BJP
UPI MDR Charge
Rahul Gandhi
Congress MPs
Digital Payments India
Parliamentary Standing Committee on Finance

More Telugu News