లండన్ కు మీనాక్షి నటరాజన్.. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జ్గా తమిళనాడు నేత చెల్లకుమార్?
- ఉన్నత విద్య కోసం లండన్ వెళుతున్న మీనాక్షి నటరాజన్
- తెలంగాణ బాధ్యతలను మరో సీనియర్ నేతకు అప్పగించే పనిలో అధిష్ఠానం
- రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన చెల్లకుమార్
దేశవ్యాప్తంగా పార్టీ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం కీలక కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా తెలంగాణతో సహా పలు రాష్ట్రాలకు కొత్త ఏఐసీసీ ఇన్చార్జ్లను, అలాగే ఐదారు రాష్ట్రాలకు నూతన పీసీసీ అధ్యక్షులను నియమించేందుకు సిద్ధమవుతోంది.
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మీనాక్షి నటరాజన్ ఉన్నత విద్య కోసం లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కు వెళుతుండటంతో ఆమె స్థానంలో తమిళనాడు సీనియర్ నేత, మాజీ ఎంపీ డాక్టర్ ఎ. చెల్లకుమార్ను నియమించే అవకాశం ఉందనే వార్తలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.
మీనాక్షి నటరాజన్ లండన్ లో ఉండే ఈ పది నెలల కాలం ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాల్సి రావడంతో, క్రియాశీలకంగా ఉన్న తెలంగాణ బాధ్యతలను మరొక సీనియర్ నేతకు అప్పగించాలని అధిష్ఠానం నిర్ణయించింది.
ఎవరీ డాక్టర్ ఎ. చెల్లకుమార్?
తమిళనాడుకు చెందిన ఈ సీనియర్ నాయకుడు 1991 (అన్నా నగర్) నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, 1996 (టి.నగర్) అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్ వర్గం) ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో టి. నగర్ నుంచి ఓటమి పాలయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కృష్ణగిరి నుంచి కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించారు. గతంలో ఏఐసీసీ కార్యదర్శిగా, గోవా రాష్ట్ర ఇన్చార్జ్గా వ్యవహరించిన అనుభవం చెల్లకుమార్కు ఉంది. గ్రౌండ్ లెవెల్ కేడర్తో మమేకమయ్యే సౌమ్యుడైన నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న వేళ పార్టీ-ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం సాధించేందుకు అనుభవజ్ఞుడైన నాయకుడిని ఇన్చార్జ్గా తీసుకురావాలని అధిష్ఠానం భావిస్తోంది.