తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఆ ఇద్దరూ మళ్లీ అధికారంలోకి తెస్తారు: శ్రీధర్ బాబు
- రేవంత్ రెడ్డి, మహేశ్ గౌడ్ మధ్య పూర్తి సమన్వయం ఉందన్న శ్రీధర్ బాబు
- రాబోయే ఎన్నికల్లో వీరిద్దరి నాయకత్వంలో కాంగ్రెస్ మళ్లీ గెలుస్తుందని వ్యాఖ్య
- అసెంబ్లీని సుదీర్ఘంగా నిర్వహించడం బీఆర్ఎస్ నేతలకు నచ్చదని విమర్శ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ల మధ్య అత్యుత్తమ పరిపాలనా, రాజకీయ సమన్వయం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ విజన్, పార్టీ నిర్మాణం ఒకే దిశలో పయనిస్తున్నాయని, రాబోయే ఎన్నికల్లో వీరిద్దరి నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తిరిగి ఘన విజయం సాధించి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో చర్చించాలనే తాము భావించామని... అయితే సభకు ముఖం చాటేసే వ్యూహంతోనే కావాలని గందరగోళం సృష్టించి వారు సభ నుంచి సస్పెన్షన్కు గురయ్యారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలకు శాసనసభ ప్రజాస్వామ్య నియమావళి, సభ నిర్వహణ అస్సలు నచ్చవని విమర్శించారు. తమ పదేళ్ల పాలనలో అసెంబ్లీని అతి తక్కువ రోజులు నడిపిన చరిత్ర బీఆర్ఎస్దేనని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం పారదర్శకంగా సుదీర్ఘంగా సభను నిర్వహిస్తుంటే తట్టుకోలేక పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. సభాపతి స్థానాన్ని అవమానిస్తూ, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచేందుకు బీఆర్ఎస్ ప్రజాస్వామ్య వ్యవస్థలను బలిచేస్తోందని శ్రీధర్ బాబు దుయ్యబట్టారు.