వాట్సప్ గవర్నెన్స్, డిజిటల్ సేవలు.. పాలనలో బెస్ట్ ప్రాక్టీసెస్ పాటించాలి: ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

వాట్సప్ గవర్నెన్స్, డిజిటల్ సేవలు.. పాలనలో బెస్ట్ ప్రాక్టీసెస్ పాటించాలి: ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu Naidu directs MLAs to follow best practices in governance and digital services
  • ఉచిత ఇసుక విధానాన్ని పక్కాగా అమలు చేయాలని సీఎం ఆదేశం
  • ఎమ్మార్పీ కంటే ఎక్కువకు మద్యం అమ్మితే కఠిన చర్యలని హెచ్చరిక
  • ఫేక్ ప్రచారాన్ని వాస్తవాలతో సమర్థంగా తిప్పికొట్టాలని నేతలకు సూచన
  • 175 నియోజకవర్గాల్లో రూ.20,400 కోట్ల విలువైన పనులకు ఆమోదం
  • టెక్నాలజీ సాయంతో ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ, పరిపాలన సేవలను ప్రజలకు మరింత సమర్థంగా అందించడంపై దృష్టి సారించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపునిచ్చారు. రెండోరోజు లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌లో ప్రసంగించిన ఆయన, కొన్ని నియోజకవర్గాలు పౌర సేవల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నాయని, అన్ని నియోజకవర్గాలు ఆ ఉత్తమ పద్ధతులను (బెస్ట్ ప్రాక్టీసెస్) అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.

ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నామని, దీనివల్ల ఏటా రూ.1000 కోట్ల ఆదాయం వదులుకుంటున్నామని చంద్రబాబు గుర్తుచేశారు. ఎక్కడైనా ఇసుక అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిపోతే కఠినంగా అడ్డుకోవాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసి, నకిలీ బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని విమర్శించారు. ఇప్పుడు మద్యం విక్రయాల్లో పారదర్శకత తీసుకొచ్చామని, ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో అవకతవకలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు.

ఫేక్ ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టండి..
ప్రభుత్వంపై జరుగుతున్న ఫేక్ ప్రచారాలను వాస్తవాలతో సమర్థంగా తిప్పికొట్టాలని నేతలకు సూచించారు. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అనేక సేవలను ఆన్‌లైన్‌లోనే అందిస్తున్నామని, క్యూఆర్ కోడ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో భద్రమైన పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామని వివరించారు. నియోజకవర్గాల్లోని దీర్ఘకాలిక సమస్యలను సుమోటోగా స్వీకరించి పరిష్కరించాలని, తద్వారా ఎమ్మెల్యేలకు ప్రజల్లో మంచి పేరు వస్తుందని అన్నారు. ప్రజల సమస్యల పట్ల మానవత్వంతో స్పందిస్తే సానుకూల దృక్పథం ఏర్పడుతుందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా భూ వివాదాల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, 2027 మార్చి నాటికి భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ‘సంజీవని’ ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తున్నామని, గత మూడేళ్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని గుర్తుచేశారు. గత సమావేశంలో ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలను సమీక్షించి, 175 నియోజకవర్గాల్లో రూ.20,400 కోట్ల విలువైన 616 అభివృద్ధి పనులను మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
Advertisement
Chandrababu Naidu
WhatsApp Governance
Digital Services Andhra Pradesh
TDP Leadership Conclave
Free Sand Policy
Land Records Digitization

More Telugu News