కొండా సుస్మిత, చిన్నారెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ గౌడ్ ఆగ్రహం
- పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు షోకాజ్ నోటీసు జారీ చేసిన మహేశ్ గౌడ్
- క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు చర్యలు ఉంటాయని వెల్లడి
- అందరూ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని సూచన
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణే ప్రధానమని, ఎంతటి వారైనా హద్దులు దాటి మాట్లాడితే చర్యలు తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత (మంత్రి కొండా సురేఖ కుమార్తె), కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సీనియర్ నేత చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొండా సుస్మిత వ్యవహారంలో ఆమె తల్లి, మంత్రి కొండా సురేఖకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరామని తెలిపారు. వారు ఇచ్చే వివరణ ఆధారంగా క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు తగిన చర్యలు ఉంటాయని చెప్పారు. ఎవరికి వారు తమకు తామే అభ్యర్థులుగా ప్రకటించుకోవడం సరికాదని చురకలంటించారు. కాంగ్రెస్లో సీట్ల కేటాయింపుకు స్పష్టమైన నియమావళి, ఎన్నికల కమిటీలు ఉంటాయని, అందరూ పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.
22ఏ భూముల వ్యవహారంలో కింది స్థాయిలో జరిగిన పొరపాటుపై ప్రతిపక్షాలు కావాలనే బురద జల్లుతున్నాయని మండిపడ్డారు. ఈ విషయం తమ ప్రభుత్వం దృష్టికి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.