మద్రాస్ హైకోర్టులో దర్శకురాలు సుధా కొంగరకు భారీ ఊరట.. రూ. 8.39 కోట్లు చెల్లించాలని ‘డాన్ పిక్చర్స్’కు ఆదేశం
- శివ కార్తికేయన్, శ్రీలీల జంటగా సుధ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పరాశక్తి’ ఫ్లాప్
- దాంతో పారితోషికాన్ని ఎగ్గొట్టిన నిర్మాతలు
- నాలుగు వారాల్లోగా ఆమెకు డబ్బులు చెల్లించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం
ప్రముఖ సినీ దర్శకురాలు సుధా కొంగరకు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. శివ కార్తికేయన్, శ్రీలీల జంటగా ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన ‘పరాశక్తి’ చిత్రం పొంగల్ కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సినిమా పరాజయం కావడంతో, చిత్ర నిర్మాణ సంస్థ ‘డాన్ పిక్చర్స్’ సుధా కొంగరకు ఇవ్వాల్సిన రూ. 8.39 కోట్ల పారితోషికాన్ని ఎగ్గొట్టడంతో ఆమె న్యాయం కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ వివాదాన్ని తొలుత మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించినప్పటికీ... నియమితులైన మధ్యవర్తులు కేసు నుంచి తప్పుకోవడంతో వివాదం కొలిక్కి రాలేదు. దీంతో, కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు ధర్మాసనం తాజాగా సుధా కొంగరకు అనుకూలంగా కీలక తీర్పు వెలువరించింది.
నాలుగు వారాల వ్యవధిలో సుధా కొంగరకు బాకీ ఉన్న రూ. 8.39 కోట్లను ఇవ్వాలని డాన్ పిక్చర్స్ సంస్థను కోర్టు ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే, ఆ నిర్మాణ సంస్థ భవిష్యత్తులో నిర్మించే చిత్రాల ద్వారా వచ్చే లాభాల నుంచి ముందుగా సుధా కొంగర బాకీని తీర్చాల్సి ఉంటుందని ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఈ సానుకూల తీర్పుతో సుధా కొంగర ఊపిరి పీల్చుకున్నారు.