అన్నా కొణిదెల ఆధ్యాత్మిక పర్యటన.. ద్రాక్షారామంలో ఓ చిన్నారికి నామకరణం.. ఫొటోలు ఇవిగో!

Anna Konidela spiritual tour and naming a baby in Draksharamam photos
  • శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ఆలయాలను సందర్శించిన అన్నా కొణిదెల
  • భర్త పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ప్రత్యేక పూజలు
  • ద్రాక్షారామం భీమేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లింపు
  • ఆమెకు ఘన స్వాగతం పలికిన జనసేన నేతలు, అభిమానులు
  • గోదావరి ప్రాంత సౌందర్యం, ఆలయాల ప్రాశస్త్యంపై ప్రశంసలు
శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా కొణిదెల ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఆధ్యాత్మిక పర్యటన చేపట్టారు. తన భర్త పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంతో పాటు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం ద్రాక్షారామంలో ఆమె పర్యటించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అన్నా కొణిదెల ఆధ్యాత్మిక పర్యటనలో ఓ హృద్యమైన, అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో, ఓ చిన్నారి తల్లిదండ్రుల కోరిక మేరకు ఆమె ఆ పసికందుకు ఆప్యాయంగా నామకరణం చేశారు. బాబును చేతుల్లోకి తీసుకుని ప్రేమగా ముద్దాడి ‘యక్షిత్ ఓంకార్ మణికంఠ’ అని పేరు పెట్టి ఆశీర్వదించారు. ఈ పరిణామంతో చిన్నారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

అంతకుముందు, శుక్రవారం ఉదయం పిఠాపురం చేరుకున్న అన్నా కొణిదెల, మొదటగా పట్టణంలోని శ్రీ కోటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించుకున్నారు. అక్కడ స్వామివారికి పూజలు చేసి, ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం, ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్వయంభూ క్షేత్రమైన శ్రీ పాదవల్లభ మహా సంస్థానం (దత్తాత్రేయ స్వామి ఆలయం)కు చేరుకున్నారు. ఈ క్షేత్రంలోని విశిష్ట సంప్రదాయాన్ని పాటిస్తూ, కోరికలు నెరవేరాలని సంకల్పించుకుని పవిత్ర వృక్షానికి కొబ్బరికాయ కట్టి మొక్కు చెల్లించుకున్నారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టకుండా, చెట్టుకు కట్టడం ఆనవాయతీగా వస్తోంది.

పిఠాపురం పర్యటన ముగించుకున్న తర్వాత ఆమె అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పంచారామ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామానికి వెళ్లారు. అక్కడ వెలసిన శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ పర్యటన సందర్భంగా పలుచోట్ల జనసేన నాయకులు, మహిళా కార్యకర్తలు, అభిమానులు అన్నా కొణిదెలకు ఘన స్వాగతం పలికారు. ఆమెను చూసేందుకు స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారందరినీ చిరునవ్వుతో పలకరించిన ఆమె, పలువురితో కలిసి ఫొటోలు దిగారు. గోదావరి ప్రాంత సహజ సౌందర్యం, ప్రాచీన ఆలయాలలోని ఆధ్యాత్మిక వాతావరణం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నా కొణిదెల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Advertisement
Anna Konidela
Pawan Kalyan
Pithapuram
Draksharamam Temple
Janasena Party
Shravana Masam spiritual tour

More Telugu News