నిబంధనల ప్రకారమే శ్రీశైలం నీటి వినియోగం: నిమ్మల రామానాయుడు
- ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య 66:34 నిష్పత్తిలోనే నీటి పంపకాలు జరగాలన్న నిమ్మల
- ఏపీ అభ్యంతరాలను ఇప్పటికే జీఆర్ఎమ్బీ దృష్టికి తీసుకెళ్లామని వెల్లడి
- నిబంధనల ప్రకారమే రెండు రాష్ట్రాలు వ్యవహరించాలన్న నిమ్మల
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నిబంధనలకు లోబడే ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం నీటిని వినియోగించుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.
రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల సమస్యలను పరిష్కరించుకోవడానికి గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB), కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) సమావేశాలు ఎంతో కీలకమని మంత్రి పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య 66:34 నిష్పత్తిలోనే నీటి పంపకాలు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఉన్న అభ్యంతరాలను ఇప్పటికే జీఆర్ఎమ్బీ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. జీఆర్ఎంబీ నిబంధనల ప్రకారమే రెండు రాష్ట్రాలు పరస్పరం వ్యవహరించాలని సూచించారు.
ఇదే క్రమంలో గోదావరి - కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై కూడా ఆయన మాట్లాడారు. ఈ అనుసంధానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని అన్నారు.