కోవిడ్ వ్యాక్సిన్ వల్లే గుండెపోటు మరణాలా?.. యువతలో ఆకస్మిక మరణాలపై అపోహలకు చెక్!
- కోవిడ్ వ్యాక్సిన్, యువత ఆకస్మిక మరణాలకు సంబంధం లేదని వెల్లడి
- ఢిల్లీ ఎయిమ్స్ నిర్వహించిన ఏడాది పరిశోధనలో స్పష్టత
- గుండె జబ్బులే యువత మరణాలకు ప్రధాన కారణమని గుర్తింపు
- అపోహలను నమ్మవద్దు, శాస్త్రీయ ఆధారాలనే విశ్వసించాలని సూచన
భారత వైద్య పరిశోధన మండలి (ICMR)కి చెందిన 'ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్'లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. ఏడాది పాటు సాగిన ఈ పరిశోధనలో భాగంగా, 18 నుంచి 45 ఏళ్ల వయసు మధ్య ఆకస్మికంగా మరణించిన వారి కేసులను ఎయిమ్స్ వైద్యులు క్షుణ్ణంగా విశ్లేషించారు. ఇందుకోసం పోస్టుమార్టం, ఇమేజింగ్, హిస్టోపాథలాజికల్ పరీక్షలతో పాటు మృతుల కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు.
ఈ విశ్లేషణలో కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వారికి, తీసుకోని వారికి మధ్య ఆకస్మిక మరణాల విషయంలో గణాంకపరంగా ఎటువంటి తేడా లేదని తేలింది. యువతలో సంభవించిన మరణాలకు ప్రధాన కారణంగా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నట్లు గుర్తించారు. శ్వాసకోశ సమస్యలు, ఇతర అనారోగ్యాలు కూడా కొన్ని కేసులలో మరణానికి దారితీశాయని తేలింది.
ఈ ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా జరిగిన శాస్త్రీయ పరిశోధనల ఫలితాలతో సరిపోలుతున్నాయని ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ అరవ తెలిపారు. "వ్యాక్సిన్ల వల్లే యువత చనిపోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలు, నిరాధారమైన నివేదికలను ఈ అధ్యయనం ఖండిస్తోంది. ప్రజలు ఇలాంటి అపోహలను నమ్మకుండా, శాస్త్రీయ ఆధారాలను మాత్రమే విశ్వసించాలి" అని ఆయన సూచించారు.
యువతలో ఆకస్మిక మరణాలకు గుర్తించని అనారోగ్య సమస్యలే కారణమని, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, జీవనశైలి మార్పుల ద్వారా ఇలాంటి ముప్పులను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.