రూ.2 వేలు దాటితే యూపీఐ చెల్లింపులు తీసుకోం.. నగదు మాత్రమే తీసుకుంటాం: పెట్రోల్ పంప్ డీలర్ల హెచ్చరిక
- అక్టోబర్ 15 నుంచి నూతన మర్చంట్ డిస్కౌంట్ రేట్ అమలు
- రూ. 2 వేలు దాటితే వ్యాపారుల నుంచి 0.4 శాతం ఎమ్డీఆర్ చార్జీ వసూలు
- తమకు పూర్తి మినహాయింపు ఇవ్వాలంటూ పెట్రోల్ పంప్ డీలర్ల డిమాండ్
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అక్టోబర్ 15 నుంచి అమలు చేయనున్న నూతన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) నిబంధనలపై దేశవ్యాప్తంగా పెట్రోల్ పంప్ నిర్వాహకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఫ్రేమ్వర్క్ ప్రకారం రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన ఇంధన యూపీఐ లావాదేవీలపై వ్యాపారుల నుంచి 0.4 శాతం ఎమ్డీఆర్ చార్జీ వసూలు చేయనున్నారు (రూ. 2,000 లోపు లావాదేవీలకు ఎటువంటి చార్జీలు ఉండవు).
ఈ నిర్ణయంపై ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా పెట్రోలియం ట్రేడర్స్ (FAIPT), ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (AIPDA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. లీటరుకు తమకు వచ్చే కమిషన్ కేవలం రూ. 2.40 నుంచి రూ. 3.40 వరకు మాత్రమే ఉంటుందని... ఒక్కో పెద్ద లావాదేవీపై 0.4 శాతం చొప్పున ఎమ్డీఆర్ చెల్లించాల్సి వస్తే పెట్రోల్ పంప్లపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని డీలర్లు పేర్కొంటున్నారు.
ఇంధనం అత్యవసర సరుకు అయినందున పెట్రోల్ బంకులకు ఎమ్డీఆర్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని... లేకపోతే అక్టోబర్ 15 నుంచి రూ. 2,000 పైబడిన ఇంధన కొనుగోళ్లకు యూపీఐ డిజిటల్ చెల్లింపులను నిలిపివేసి, కేవలం నగదు రూపంలో మాత్రమే స్వీకరిస్తామని హెచ్చరించారు.