హర్షిత్‌ రాణాకు గాయం.. రెండు కీలక టోర్నీలకు యశ్‌ ఠాకూర్‌!

హర్షిత్‌ రాణాకు గాయం.. రెండు కీలక టోర్నీలకు యశ్‌ ఠాకూర్‌!

Harshit Rana injured Yash Thakur for two key tournaments
  • గాయంతో ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌కు హర్షిత్‌ రాణా దూరం
  • ఆసియా క్రీడల్లోనూ హర్షిత్‌ ఆడటం లేదు
  • రెండు జట్లలోనూ హర్షిత్‌ స్థానంలో యశ్‌ ఠాకూర్‌
  • సెప్టెంబర్‌ 7న బౌలింగ్‌ చేస్తుండగా హర్షిత్‌కు తొడ కండరాల గాయం
  • జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో యశ్‌ అంతర్జాతీయ అరంగేట్రం
ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. పేసర్‌ హర్షిత్‌ రాణా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో యశ్‌ ఠాకూర్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌తో పాటు 2026 ఆసియా క్రీడల్లోనూ హర్షిత్‌ స్థానాన్ని యశ్‌ భర్తీ చేయనున్నాడు.

సెప్టెంబర్‌ 7న మ్యాచ్‌ సిమ్యులేషన్‌లో బౌలింగ్‌ చేస్తుండగా హర్షిత్‌కు ‘రెక్టస్‌ ఫెమోరిస్‌ స్ట్రెయిన్‌’ ఏర్పడింది. అంతకుముందు బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో అతడు రిహాబిలిటేషన్‌ తీసుకుంటున్నాడు. కోలుకుంటున్న సమయంలో ఈ గాయం కావడంతో ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌, ఆసియా క్రీడలకు అతడిని తప్పించారు. ఈ ఏడాది హర్షిత్‌ గాయాలతో పలుమార్లు ఇబ్బందిపడ్డాడు. మోకాలి గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరమైన అతడు శస్త్రచికిత్స తర్వాత ఐపీఎల్‌ 2026లోనూ ఆడలేకపోయాడు. జూన్‌లో పునరాగమనం చేశాడు. జులైలో ఇంగ్లాండ్‌ పర్యటనలో తొడ కండరాల గాయంతో మళ్లీ విరామం తీసుకున్నాడు.

ఇక యశ్‌ ఠాకూర్‌ జులైలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. రెండు మ్యాచ్‌లు ఆడిన అతడు ఒక్కో మ్యాచ్‌లో రెండేసి వికెట్లు తీశాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌ సెప్టెంబర్‌ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలో జరగనుంది. ఆసియా క్రీడలు సెప్టెంబర్‌ 19 నుంచి జపాన్ లోని ఐచి-నాగోయాలో ప్రారంభం కానున్నాయి. భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్‌ను సెప్టెంబర్‌ 28న ఆడనుంది. హర్షిత్‌ స్థానంలో రెండు జట్లలోనూ యశ్‌ ఠాకూర్‌కు చోటు దక్కింది.

భారత్‌కు 2026 ఆసియా క్రీడల్లో నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ లభించింది. ఎందుకంటే భారత్‌ 2023 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్‌లో స్వర్ణ పతకం సాధించి డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ఐసీసీ ర్యాంకింగ్ కారణంగా, ఈ టోర్నమెంట్‌ ఫార్మాట్‌లో భారత్‌తో పాటు పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు నేరుగా క్వార్టర్‌ఫైనల్‌ అవకాశం ఇచ్చారు. అందువల్ల భారత్‌ గ్రూప్‌ మ్యాచ్‌లు ఆడకుండా సెప్టెంబర్‌ 28న నేరుగా క్వార్టర్‌ఫైనల్‌ ఆడనుంది. 

ఆఫ్ఘనిస్థాన్‌ టీ20లకు భారత జట్టు: శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ (వైస్‌ కెప్టెన్‌), శివమ్‌ దూబే, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, యశ్‌ ఠాకూర్‌. బుమ్రా, నితీశ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ ఫిట్‌నెస్‌కు లోబడి అందుబాటులో ఉంటారు.
Advertisement
Harshit Rana
Yash Thakur
India Afghanistan T20
Asian Games 2026
BCCI India Squad
Cricket Injury News

More Telugu News