కోర్టుకెక్కితే బెడిసికొట్టింది.. అక్రమ భవనం సీల్ చేయాలని హైకోర్టు ఆదేశం!

కోర్టుకెక్కితే బెడిసికొట్టింది.. అక్రమ భవనం సీల్ చేయాలని హైకోర్టు ఆదేశం!

Telangana High Court orders to seal illegal building after petition backfires
  • అక్రమ నిర్మాణంపై కోర్టుకెక్కిన యజమానికి చుక్కెదురు
  • సిద్దంబర్ బజార్‌లోని ఐదంతస్తుల భవనాన్ని సీల్ చేయాలని ఆదేశం
  • నిర్మాణ స్థలాల వద్ద పర్మిషన్ వివరాలు ప్రదర్శించడం తప్పనిసరి
  • రూ.1 రిజిస్ట్రేషన్ స్కీమ్‌ను దుర్వినియోగం చేసినట్లు గుర్తించిన న్యాయస్థానం
  • అక్రమ నిర్మాణాలపై మొదటి దశలోనే చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీకి సూచన
అక్రమ నిర్మాణాన్ని క్రమబద్ధీకరించాలని కోరుతూ కోర్టుకెక్కిన ఓ భవన యజమానికి తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పిటిషనర్‌కు ఎలాంటి ఉపశమనం ఇవ్వకపోగా, ఆ అక్రమ భవనాన్ని తక్షణమే సీల్ చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ని ఆదేశించింది. అంతేకాకుండా, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నిర్మాణ స్థలం వద్ద తప్పనిసరిగా బిల్డింగ్ పర్మిషన్ వివరాలను ప్రదర్శించాలని కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.

అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ పాతబస్తీలోని సిద్దంబర్ బజార్‌లో రాజ్ కుమార్ అనే వ్యాపారికి చెందిన స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా గ్రౌండ్ ప్లస్ ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఈ నిర్మాణంపై జీహెచ్‌ఎంసీ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేసి, ఆగస్టు 5, 2026న నిర్మాణాన్ని ఆపాలని ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ నిర్మాణం కొనసాగడంతో, తన అదనపు నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్లు 455-A, 455-AA కింద రెగ్యులరైజ్ చేయాలంటూ రాజ్ కుమార్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

రూ.1 స్కీమ్‌తో మోసం
ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి ధర్మాసనం.. పిటిషనర్ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించింది. జీహెచ్‌ఎంసీ వాదనల ప్రకారం, రాజ్ కుమార్‌కు మొత్తం 114.14 చదరపు గజాల స్థలం ఉండగా, కేవలం 43.29 చదరపు మీటర్లకే తన పేరు మీద పర్మిషన్ తీసుకున్నారు. మిగిలిన భాగాన్ని మరో ముగ్గురి పేర్ల మీద చూపించారు. 75 గజాల లోపు ప్లాట్లకు వర్తించే తెలంగాణ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (TS-bPASS) కింద ఉన్న ₹1 టోకెన్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని దుర్వినియోగం చేసేందుకే ఇలా చేశారని జీహెచ్‌ఎంసీ కోర్టుకు వివరించింది. నిబంధనల ప్రకారం, 75 గజాల కంటే పెద్ద ప్లాట్‌ను ఇలా విభజించి మినహాయింపులు పొందడం చట్టవిరుద్ధం.

కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
జీహెచ్‌ఎంసీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, పిటిషనర్‌కు ఉపశమనం కల్పించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. నిబంధనల ప్రకారం అంత చిన్న స్థలంలో కేవలం గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన నిర్మాణాన్ని కొనసాగించే హక్కు రాదని, ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉన్నప్పుడు ఇది వర్తించదని జస్టిస్ విజయసేన్ రెడ్డి తేల్చిచెప్పారు.

సెల్ఫ్-సర్టిఫికేషన్ విధానాన్ని దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగించే ధోరణి అని వ్యాఖ్యానించిన హైకోర్టు, అక్రమ నిర్మాణాలను ప్రారంభ దశలోనే గుర్తించకుండా, అవి పూర్తయ్యే వరకు అధికారులు ఎందుకు మౌనంగా  ఉన్నారని జీహెచ్‌ఎంసీని ప్రశ్నించింది. సిద్దంబర్ బజార్, బేగంబజార్ ప్రాంతాల్లోని నిర్మాణాలను తనిఖీ చేసి, అక్రమ కార్యకలాపాలను అడ్డుకుని, నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రజలకు, అధికారులకు సులభంగా తెలిసేలా ఇకపై చిన్న ప్లాట్లతో సహా అన్ని నిర్మాణాల వద్ద పర్మిషన్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Telangana High Court
Hyderabad illegal building
GHMC building permission
TS bPASS 1 rupee scheme
Siddambar Bazar construction
Justice B Vijaysen Reddy

More Telugu News