సిద్దిపేటలో సీరియల్ కిల్లర్.. కొడుకుతో కలిసి మహిళ హత్యలు

Serial killer in Siddipet woman murders women with help of minor son
  • సిద్దిపేట జిల్లాలో మహిళల వరుస హత్యల కేసును ఛేదించిన పోలీసులు
  • మైనర్ కొడుకుతో కలిసి ఇద్దరు మహిళలను హత్య చేసిన మహిళ అరెస్ట్
  • బంగారం, డబ్బు కోసమే ఈ దారుణాలకు పాల్పడినట్లు వెల్లడి
  • భర్తను చంపి బీమా డబ్బులు కొట్టేయాలని కూడా ప్లాన్ చేసిన నిందితురాలు
సిద్దిపేట జిల్లాలో కలకలం రేపిన మహిళల వరుస హత్యల కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. డబ్బు, బంగారం కోసం కన్న కొడుకు (మైనర్)తో కలిసి ఓ మహిళే ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు తేల్చారు. ఇద్దరు మహిళలను గొంతు నులిమి హత్య చేసి, ఆనవాళ్లు లేకుండా పెట్రోల్ పోసి కాల్చివేసినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సిద్దిపేట పోలీస్ కమిషనర్ రమేశ్ మీడియాకు వెల్లడించారు.

దుబ్బాక మండలం భూంపల్లి గ్రామానికి చెందిన చాకలి రజిత, అనారోగ్యంతో బాధపడుతున్న భర్త, మైనర్ కుమారుడితో కలిసి నివసిస్తోంది. ఓ కిరాణా దుకాణం నడుపుతున్న ఆమె, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో హత్యలకు పథకం పన్నింది. తన మైనర్ కొడుకును కూడా ఈ నేరంలో భాగస్వామిని చేసింది. ఒంటరిగా ఉండే మహిళలను, కుటుంబ తగాదాలు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుంటే అనుమానం తమపైకి రాదని భావించి పక్కా ప్రణాళికతో హత్యలు చేశారు.

ఈ ఏడాది మే నెలలో రేఖ (25) అనే యువతిని తొలి టార్గెట్‌గా ఎంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చురుగ్గా ఉండే ఆమెను హత్య చేస్తే, ఎవరైనా కిడ్నాప్ చేశారనే అనుమానాలు వస్తాయని భావించారు. ఆమెను చంపి, ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకుని, మృతదేహాన్ని అడవిలో కాల్చివేశారు. ఇక ఈ నెల 7న భూతగాదాలు ఉన్న అతికం విజయ (45)ను రెండో లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె హత్యకు గురైతే అనుమానం ఆమె దాయాదులపైకి వెళ్తుందని ప్లాన్ చేశారు. హత్య అనంతరం మృతదేహాన్ని కాల్చేందుకు ప్రయత్నించగా వర్షం పడటంతో, రామక్కపేట వద్ద రోడ్డు పక్కన సగం కాలిన స్థితిలో వదిలేసి వెళ్లారు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులు రజిత, ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు చెప్పిన విషయాలు విని పోలీసులు నివ్వెరపోయారు. ఈ రెండు హత్యలే కాకుండా, జూన్‌లో అన్నపూర్ణ అనే మరో మహిళపై దాడి చేసి బంగారు గొలుసు లాక్కెళ్లినట్లు అంగీకరించారు. అంతేకాదు, అనారోగ్యంతో ఉన్న తన భర్త దుబ్బయ్య పేరు మీద ఇన్సూరెన్స్ చేయించి, ఆయన్ను కూడా హత్య చేయాలని చూసినట్లు, మరో ముగ్గురు మహిళలను చంపేందుకు ప్రణాళికలు వేసినట్లు ఒప్పుకున్నారు.

నిందితుల నుంచి రూ. 10 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రధాన నిందితురాలు రజితను రిమాండ్‌కు తరలించగా, మైనర్ బాలుడిని జువైనల్ హోమ్‌కు పంపినట్లు వివరించారు.
Advertisement
Chakali Rajitha
Siddipet Serial Killer
Telangana Crime News
Minor Son Murder Case
Siddipet Police Commissioner Ramesh
Bhumpally Village Murder

More Telugu News