Advertisement

30 ఏళ్ల క్రితం పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా స్వయంగా నిరసన... కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు విచిత్ర పరిస్థితి...

Dharmendra Pradhan protested against paper leaks 30 years ago as a student leader
  • నీట్ పేపర్ లీక్ వివాదంలో చిక్కుకున్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
  • 30 ఏళ్ల క్రితం పేపర్ లీక్‌పై ఆయనే నిరసన తెలిపిన వైనం
  • ఒకప్పటి ఆందోళనకారుడు.. నేడు అదే ఆరోపణలతో ఇబ్బందులు
  • ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ సీజేపీ నిరసనలు
నీట్ పేపర్ లీకేజీ వివాదంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ విషయంలో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 30 ఏళ్ల క్రితం, ఆయనే స్వయంగా పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపినట్లు పాత నివేదికలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.

1990వ దశకంలో విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో, పరీక్షల్లో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఆందోళనల్లో ఆయన కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం నీట్ వ్యవహారంలో ఆయన రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వంటి విపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, నాటి ఆయన క్రియాశీలతకు, నేడు మంత్రిగా ఆయన బాధ్యతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.

ఈ పాత నివేదికలు ప్రస్తుతం ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. ఒకప్పుడు తాను దేనికోసమైతే పోరాడారో, నేడు అదే ఆరోపణల నడుమ మంత్రిగా జవాబుదారీతనం వహించాల్సిన పరిస్థితిలో ఆయన చిక్కుకున్నారు.

1997లో జానకీ వల్లభ్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒడిశాలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. నాడు భువనేశ్వర్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో, పరీక్ష పత్రాల లీకేజీకి నిరసనగా సుమారు 1,500 మంది విద్యార్థులు రాష్ట్ర సచివాలయం వెలుపల నిరసన తెలిపారు. ఆ విద్యార్థుల సమూహంలో ప్రస్తుత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఉన్నారు.

ఏబీవీపీ నాయకుడిగా నాడు ధర్మేంద్ర ప్రధాన్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వీధుల్లోకి వచ్చారు. 1994 నుంచి 1997 మధ్య ఆయన రెండుసార్లు ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో ఒడిశాలో ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు రావడంతో ధర్మేంద్ర ప్రధాన్ నిరసన చేపట్టారు.

నాటి ధర్మేంద్ర ప్రధాన్ నిరసనను భువనేశ్వర్‌లోని ఆర్ఎండి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, ఒక జూనియర్ విద్యర్థి గుర్తు చేసుకున్నారు. "ఆ రోజు మేము సచివాలయం ముందు ఒడిశా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేశాము. అక్కడ మాతో సుమారు 1,500 మంది విద్యార్థులు కలిశారు" అని ధర్మేంద్ర ప్రధాన్ జూనియర్ రౌత్ తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని, ఆ సమయంలో ధర్మేంద్ర ప్రధాన్‌పై కూడా పోలీసులు లాఠీలు ఝుళిపించారని ఆయన గుర్తు చేసుకున్నారు.
Advertisement
Dharmendra Pradhan
NEET paper leak controversy
ABVP student leader
Odisha paper leak 1997
Education Minister
Student protests

More Telugu News