ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావు కస్టడీని పొడిగించిన సుప్రీంకోర్టు
- విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదన్న సిట్
- ఈనెల 25 వరకు కస్టడీకి అనుమతించిన సుప్రీంకోర్టు
- సిట్ నివేదికను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం
ఈ కేసుపై జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో డిసెంబర్ 12న ప్రభాకర్రావు లొంగిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వారం రోజుల పాటు ఆయన్ను విచారించిన సిట్, కస్టోడియల్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. నిందితుడు విచారణలో కీలక సమాచారం ఇవ్వకుండా, దర్యాప్తునకు సహకరించడం లేదని సిట్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు మరోసారి కస్టోడియల్ విచారణ అవసరమని అభ్యర్థించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, సిట్ అభ్యర్థనను అంగీకరించింది. ఈనెల 25 వరకు ప్రభాకర్రావును సిట్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.