'బైజూస్' రవీంద్రన్కు అమెరికా కోర్టులో భారీ ఊరట
- గతంలో బైజూ రవీంద్రన్కు వ్యతిరేకంగా ఇచ్చిన బిలియన్ డాలర్ల తీర్పు తాజాగా రద్దు
- తన పాత తీర్పును సమీక్షించి వెనక్కి తీసుకున్న అమెరికా డెలావేర్ కోర్టు
- నష్టపరిహారంపై జనవరిలో మళ్లీ విచారణ జరపనున్నట్టు ప్రకటన
- ప్రస్తుతానికి రవీంద్రన్ ఒక్క డాలర్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ
- 2.5 బిలియన్ డాలర్ల దావా వేయనున్నట్టు బైజూస్ లీగల్ టీమ్ వెల్లడి
ఈ తీర్పుపై రవీంద్రన్ న్యాయ సలహాదారు మైఖేల్ మెక్నట్ స్పందిస్తూ, ఇది చాలా కీలకమైన పరిణామమని అన్నారు. "ఈ దశలో బైజూ రవీంద్రన్ ఒక్క డాలర్ కూడా నష్టపరిహారంగా చెల్లించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టంగా చెప్పింది" అని ఆయన తెలిపారు. త్వరలో జరిగే విచారణలో రుణదాతలకు ఎలాంటి నష్టం జరగలేదని నిరూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రుణదాతలైన జీఎల్ఏఎస్ ట్రస్ట్ (GLAS Trust), ఇతర సంస్థలు తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టులను, ప్రజలను తప్పుదారి పట్టించాయని రవీంద్రన్ న్యాయ బృందం తీవ్ర ఆరోపణలు చేసింది. వారి చర్యల వల్లే తమ ఎడ్టెక్ వ్యాపారం కుప్పకూలిందని, సుమారు 85,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని, 25 కోట్ల మంది విద్యార్థులపై ప్రభావం పడిందని వారు వాదించారు.
అంతేకాకుండా, 533 మిలియన్ డాలర్ల 'ఆల్ఫా ఫండ్స్'ను వ్యవస్థాపకులు వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్నారని జీఎల్ఏఎస్ ట్రస్ట్ తప్పుడు ప్రచారం చేసిందని, దీనికి సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామని రవీంద్రన్ బృందం తెలిపింది. ఈ ఏడాది చివరిలోగా జీఎల్ఏఎస్ ట్రస్ట్, ఇతర పార్టీలపై 2.5 బిలియన్ డాలర్ల దావా వేయాలని కూడా యోచిస్తున్నట్టు వారు వెల్లడించారు.