'మత్తువదలరా'ను హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచనను అందుకే విరమించుకున్నాం: దర్శకుడు రితేష్రానా
- అందరి ప్రశంసలు అందుకుంటున్న మత్తువదలరా-2
- నిర్మాత చెర్రీ నాకు ఫాదర్ లాంటి వాడు
- బాబు పాత్ర లేకపోతే యేసు పాత్ర లేదు
ఆయన విలేకరులతో మాట్లాడుతూ "ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా చిత్రంలోని కామెడీని ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్మీడియాలో యాక్టివ్గా వుండే వాళ్లు సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని, డైలాగ్ను ఆస్వాదిస్తున్నారు. నిడివి సమస్య వల్ల కొంత ఎంటర్టైన్మెంట్ పార్ట్ను తీసేయాల్సి వచ్చింది. ఇక చిత్రంలో బాబు, యేసు పాత్రలు పోషించిన శ్రీసింహా, సత్యల నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. సినిమాలో బాబు పాత్ర లేకపోతే యేసు పాత్ర లేదు. కాకపోతే యేసు పాత్ర కామెడీని ఎక్కువగా పండించడం వల్ల అందరూ యేసు పాత్రలో నటించిన సత్యకు కనెక్ట్ అవుతున్నారు.
సినిమాలో రెండు సమానమైన పాత్రలే. ఈ సినిమా విజయంలో కాలభైరవ సంగీతం కూడా ముఖ్య భూమిక పోషించింది. మా ఇద్దరికి సింక్ కుదరటం వల్ల వర్క్ ఈజీగా ఉంటుంది. సినిమాకు కావాల్సిన అన్ని వనరులు సమాకూర్చిన నిర్మాత చెర్రీ (చిరంజీవి) నాకు ఫాదర్ లాంటి వ్యక్తి. ఆయన ఇచ్చిన అవకాశం వల్లే ఈ రోజు నాకు ఇంత గుర్తింపు వచ్చింది.
మొదట్లో మత్తువదలరా పార్ట్-1ను హిందీలో రీమేక్ చేయాలనుకున్నాం. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. అయితే ఈ లోపు కోవిడ్ సమయంలో తెలుగు పార్ట్ను అన్ని భాషల వారు చూసేశారు. ఇక హిందీలో కానీ, ఇతర భాషల్లో కానీ తీయాల్సిన అవసరం లేదనిపించి రీమేక్ ఆలోచనను విరమించుకున్నాం. మత్తువదలరాకు పార్ట్-3 కూడా ఉంటుంది. అయితే నేను మరో సినిమా చేసిన తరువాత దాని గురించి ఆలోచిస్తాను" అని చెప్పారు.