సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం.. నటి నివేదా థామస్ సీరియస్ వార్నింగ్
- ఏఐ మార్ఫింగ్ ఫొటోలపై మండిపడ్డ నటి నివేదా థామస్
- తన ఫొటోను అసభ్యంగా మార్చడంపై తీవ్ర ఆగ్రహం
- వెంటనే తొలగించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
- ఇలాంటివి షేర్ చేయవద్దని నెటిజన్లకు హీరోయిన్ విజ్ఞప్తి
ఇటీవల నివేదా థామస్ క్రీమ్ కలర్ చీరలో ఉన్న ఒక అందమైన ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో వైరల్ అవ్వగా, కొందరు ఆకతాయిలు దానిని ఏఐ సాయంతో అసభ్యకరంగా మార్చి ఆన్లైన్లో సర్క్యులేట్ చేయడం ప్రారంభించారు. ఈ విషయం ఆమె దృష్టికి రావడంతో తీవ్రంగా స్పందించారు.
ఈ సందర్భంగా నివేదా తన ప్రకటనలో, "నా అనుమతి లేకుండా నా ఫొటోను ఏఐ సాయంతో మార్చి సర్క్యులేట్ చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇది చాలా బాధాకరం. ఆమోదయోగ్యం కాదు, చట్టవిరుద్ధం కూడా. ఇది నా వ్యక్తిగత గోప్యతకు తీవ్ర భంగం కలిగించడమే" అని పేర్కొన్నారు.
"ఈ విషయాన్ని నేను తీవ్రంగా పరిగణిస్తున్నాను. అజ్ఞాత ఖాతాల ద్వారా ఇలాంటివి చేస్తున్న వారు వెంటనే ఆ కంటెంట్ను తొలగించాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవు. ఇటువంటి వాటిని ఎవరూ షేర్ చేయవద్దు, ప్రోత్సహించవద్దు" అని ఆమె విజ్ఞప్తి చేశారు. ‘జెంటిల్మన్’, ‘నిన్ను కోరి’, ‘జై లవకుశ’, ‘వకీల్ సాబ్’ వంటి విజయవంతమైన చిత్రాలతో నివేదా థామస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు.