జీ7ను పక్కనపెట్టనున్న ట్రంప్? .. భారత్ తో కలిసి శక్తివంతమైన 'కోర్ ఫైవ్' కూటమి ఏర్పాటు యోచనలో ట్రంప్!
- జీ7 స్థానంలో 'సీ5' పేరుతో కొత్త కూటమికి ట్రంప్ సన్నాహాలు
- అమెరికా, రష్యా, చైనా, జపాన్తో పాటు భారత్కు కీలక స్థానం
- ఇది ట్రంప్ మార్క్ ఆలోచనే అంటున్న జాతీయ భద్రతా నిపుణులు
అమెరికన్ మీడియా సంస్థ 'పొలిటికో' ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది. గతవారం వైట్హౌస్ విడుదల చేసిన జాతీయ భద్రతా వ్యూహానికి సంబంధించిన ప్రచురించని రహస్య పత్రంలో ఈ 'సీ5' ప్రతిపాదన ఉన్నట్లు ఆ కథనం పేర్కొంది. సంపద, ప్రజాస్వామ్య పాలన వంటి జీ7 నిబంధనలతో సంబంధం లేకుండా, ప్రపంచంలోని ప్రధాన సైనిక, ఆర్థిక, జనాభా శక్తిగా ఉన్న దేశాలతో ఈ కొత్త కూటమిని ఏర్పాటు చేయాలన్నది దీని వెనుక ఉన్న ఆలోచన.
అయితే, ఈ రహస్య పత్రం ఉందన్న వార్తలను వైట్హౌస్ ఖండించింది. అలాంటి ప్రత్యామ్నాయ పత్రమేదీ లేదని ప్రెస్ సెక్రటరీ హన్నా కెల్లీ స్పష్టం చేశారు. కానీ, జాతీయ భద్రతా నిపుణులు మాత్రం ఇది ట్రంప్ మార్క్ ఆలోచనేనని ('ట్రంపియన్' ఐడియా) విశ్లేషిస్తున్నారు. బలమైన నాయకులతో కలిసి పనిచేయడానికి ఇష్టపడే ట్రంప్ ప్రపంచ దృష్టికోణానికి ఇది సరిగ్గా సరిపోతుందని వారు చెబుతున్నారు.
ఈ కొత్త కూటమిలో యూరప్ దేశాలకు చోటు లేకపోవడం గమనార్హం. మరోవైపు, ఈ ప్రతిపాదన అమెరికా మిత్రపక్షాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇది రష్యా వంటి దేశాల అధినేతలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడమేనని, పశ్చిమ దేశాల ఐక్యతను, నాటో కూటమిని బలహీనపరిచే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ, ఈ ప్రతిపాదన నిజమైతే ప్రపంచ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.