Sangeetha: ఆ గ్రూపులో నేను లేను: సీనియర్ నటి సంగీత

Senior actress Sangeetha interview

  • అప్పట్లో చేతినిండా సినిమాలున్నాయన్న సంగీత
  • ఇప్పుడు ఒక్క సినిమా కూడా చేతిలో లేని పరిస్థితి తనదని వ్యాఖ్య 
  • ప్రభాస్ మూవీ తర్వాత పెద్దగా ఆఫర్లు రాలేదని వెల్లడి
  • అప్పట్లో డబ్బులు సేవింగ్స్ చేయడం వల్ల ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగుతోందన్న సంగీత   

సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటీమణులు ఇప్పటికీ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ సినిమానే వారి జీవితంగా బతుకుతున్నారు. పెద్ద పెద్ద స్టార్స్ తో హీరోయిన్ గా చేసి.. ఆ తరువాత వదిన, తల్లి పాత్రలలో నటిస్తుంటారు. అలాంటి నటీమణులలో సీనియర్ నటి సంగీత ఒకరు. ముత్యాల ముగ్గుతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవిత విశేషాలను పంచుకున్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం...

మీరు చెన్నైలో వున్నప్పుడు బాగుండేదా? ఇప్పుడు హైదరాబాదులో ఉంటుంటే బాగుందా? అని అడిగిన ప్రశ్నకు సంగీత చెబుతూ... "చెన్నై బావుంటుంది కానీ, ఇప్పుడు అందరూ ఇక్కడ (హైదరాబాద్) సెటిల్ అయ్యారు. కాబట్టి నాకు కూడా ఇక్కడే ఉండాలని అనిపిస్తోంది. అదీకాక ఇండస్ట్రీ అంతా చెన్నై నుండి హైదరాబాద్ కు తరలి వచ్చిన తర్వాత నేను కూడా ఇక్కడే సెటిల్ అయ్యాను" అని తెలిపారు.

మీకు ప్రస్తుతం ఏమైనా అవకాశాలు వస్తున్నాయా? అన్న ప్రశ్నకి స్పందిస్తూ... "ప్రస్తుతానికైతే ఎలాంటి ఆఫర్లు రావట్లేదు. తమిళంలో కూడా ఎలాంటి ఆఫర్స్ లేవు. సీరియల్ లో చేయమని కొంతమంది అడిగారు. కానీ నాకు సీరియల్ లో చేయడం అంతగా ఇష్టంలేక చేయలేదు" అన్నారు. 

అలనాటి నటులందరూ గ్రూప్ గా క్రియేట్ అయ్యి మీట్ అవుతూ ఉంటారు కదా.. అలానే మీరు కూడా మీట్ అవుతున్నారా.. మీకు కూడా అలాంటి గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా? అని అడిగిన ప్రశ్నకు సంగీత స్పందిస్తూ... "సీనియర్ నటులకు ఒక గ్రూప్ ఉంది. మీరు చెప్పినట్లుగా, 80వ దశకం నాటి నటులతో కూడిన ఆ గ్రూప్ లో నేను లేను. నేను వాళ్లకన్నా సీనియర్ ని. 

మాకంటూ చాలా తక్కువ మంది ఆర్టిస్టులతో 20 మందితో ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూపులో లత గారు, జయంతి కన్నదాసు, రాజేశ్వరి, ఎల్ఆర్ ఈశ్వరి, సత్యప్రియ ఇలా చాలామంది ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ నటీమణులు అంతా ఒక చిన్న గ్రూపుగా క్రియేట్ చేసుకుని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము" అని తెలిపారు.

మీకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? అని అడిగిన ప్రశ్నకు.. "నేను అందరితో కలిసి వర్క్ చేస్తాను. శత్రువులు ఎవరూ లేరు. ప్రత్యేకంగా ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. నాకున్న ఏకైక ఫ్రెండ్ మా ఊర్లో ఉండేవారు. ఆవిడ కూడా ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలియదు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అందరితో నేను మంచిగానే ఉన్నాను. శత్రువులు అయితే ఇప్పటివరకూ ఎవరూ లేరు" అని సంగీత తెలిపారు.

"సినిమా ఇండస్ట్రీలో మొదటి చిత్రంతోనే నాకు మంచి సినిమా పడింది. ముత్యాలముగ్గుతో నేను ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను. సెట్ లో నా బిహేవియర్.. అందరితో నేను కలిసిపోయే తీరు వల్ల నాకు మంచి ఆఫర్స్ వచ్చాయి. ఎక్కువగా కన్నడ సినిమాలు చేశాను. తెలుగు, మలయాళంలో కూడా మంచి సినిమాలు చేశాను. తమిళంలో తక్కువ చేశాను. 

నేను ఒక ఇండస్ట్రీలో సినిమాలు చేసేటప్పుడు ఇంకో ఇండస్ట్రీ వాళ్ళు నేను సినిమాలు మానేశానేమో అని అనుకునేవారు. కానీ నేను కంటిన్యూగా సినిమాలు చేశాను. కరోనాకి ముందు దాకా నేను సినిమాలలో నటిస్తూనే ఉన్నాను. ఐదు సంవత్సరాల నుండి నా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అంతకు ముందు వరకూ నేను చాలా సినిమాలు చేశాను. ఏక్ నిరంజన్ సినిమా ప్రభాస్ తో చేశాను. ప్రెషర్ కుక్కర్ అనే సినిమా నా చివరి సినిమా. తర్వాత ఎటువంటి సినిమాలు ఒప్పుకోలేదు. దానికి కారణం అప్పట్లో కరోనా వల్ల బయటికి రాకూడదు అనుకున్నాను. ఆఫర్లు వచ్చినా చేయకూడదు అనుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి చేతిలో ఏ సినిమా లేదు. అప్పట్లో ఉన్న డబ్బులు సేవింగ్స్ చేయడం వల్ల ఇప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫైనాన్షియల్ గా జరిగిపోతోంది. నేను, మా వారు ఇద్దరమే కాబట్టి మాకు ఎక్కువ ఖర్చులు కూడా లేవు" అని సంగీత తెలిపారు.

  • Loading...

More Telugu News