Dharshan: అశ్లీల సందేశాలతో మొదలై... హత్యకు గురయ్యే దాకా...! రేణుకా స్వామి హత్యలో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు

Renuka Swamy Murder Story

  • పవిత్రా గౌడ్ కు రేణుకా స్వామి అశ్లీల సందేశాలు
  • న్యూడ్ ఫొటోలు పంపుతూ వేధింపులకు పాల్పడ్డ రేణుకా స్వామి
  • తన సహాయకులతో కలిసి బుద్ధి చెప్పేందుకు పవిత్ర ప్లాన్
  • మందలించేందుకు పిలిపించి తీవ్రంగా దాడి చేసిన దర్శన్

హీరోపై వెర్రి అభిమానం.. ఆయన ఫ్యామిలీ బాగుండాలనే పిచ్చి కోరికతో తన కుటుంబం గురించి ఆలోచించలేదా అభిమాని. కట్టుకున్న భార్యతోనే హీరో కలిసి ఉండాలని, హీరోను వలలో వేసుకున్న నటిని వేధించాడు. ఆ తర్వాత ఆమెపై మోహం పెంచుకుని మెసేజ్ లు చేశాడు. సోషల్ మీడియాలో అసభ్య సందేశాలు పంపిస్తూ హీరోను వదిలి తనతో ఉండాలని కోరాడు. 

నెలల తరబడి సాగిన ఈ వేధింపుల పర్వానికి ముగింపు పలికేందుకు సదరు నటి తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఆ అభిమాని భూమ్మీదే లేకుండా పోగా... దానికి కారణమైన హీరో, నటి, సహాయకులు మొత్తం పదిహేడు మంది కటకటాల పాలయ్యారు. కన్నడ హీరో దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్యోదంతంలో బయటపడ్డ సంచలన విషయాలివి.

పవిత్రాగౌడ్ కు అసభ్య సందేశాలు
రేణుకా స్వామి కొంతకాలంగా నటి పవిత్రాగౌడ్ కు అసభ్య సందేశాలు పంపించడం మొదలు పెట్టాడు. తన నగ్న ఫొటోలు పంపిస్తూ, అసభ్యకరంగా కామెంట్లు పెడుతూ విచ్చలవిడిగా ప్రవర్తించాడని పోలీసుల పరిశోధనలో బయటపడింది. ఇన్ స్టాగ్రామ్ లో పవిత్రకు పంపించిన పలు మెసేజ్ లను పోలీసులు బయటపెట్టారు. 

పవిత్ర అతడిని బ్లాక్ చేసినా మరో ఖాతాతో సందేశాలు పెట్టడం మొదలుపెట్టాడు. హీరో దర్శన్ ను ఆయన భార్యకు వదిలి తనతో రమ్మంటూ పవిత్రను కోరాడు. ‘నీ రేటు ఎంత.. నిన్ను నేను పోషిస్తాను’ అంటూ మెసేజ్ చేశాడు. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలైన ఈ వేధింపులతో పవిత్ర విసిగిపోయింది. తన సహాయకుడితో కలిసి రేణుకాస్వామి గట్టిగా బుద్ధి చెప్పేందుకు ప్లాన్ చేసింది. సానుకూలంగా స్పందిస్తున్నట్లు నటించి రేణుకా స్వామి వివరాలు రాబట్టింది.

ఫోన్ నంబర్ ఇవ్వాలని..
రేణుకా స్వామితో సానుకూలంగా చాట్ చేస్తూ ఫోన్ నెంబర్ ఇవ్వాలని పవిత్రాగౌడ్ కోరింది. దీంతో రేణుకాస్వామి స్పందించి ఆమె నెంబర్ ఇవ్వాలని అడిగాడు. పవిత్ర తన సహాయకుడు పవన్ నెంబర్ ఇవ్వగా జూన్ 5న రాత్రి రేణుకా స్వామి ఫోన్ చేశాడు. అప్పుడు పవిత్ర పక్కనే ఉండడంతో మాట్లాడి వివరాలు అడిగింది. 

ఇకపై సోషల్ మీడియాలో అసభ్య సందేశాలు పంపవద్దని, వాట్సాప్ లోనే ఛాటింగ్ చేసుకుందామని చెప్పింది. ఆ తర్వాత రేణుకా స్వామితో పవిత్ర పేరిట పవన్ ఛాటింగ్ చేశాడు. రేణకా స్వామి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించాడు. 

అయితే, రేణుకా స్వామి తప్పుడు వివరాలు చెప్పి వారిని ఏమార్చాడు. ఓ ఫార్మసీలో పనిచేస్తున్నానని చెప్పడంతో పవిత్ర అక్కడికి తన మనుషులను పంపించి విచారించింది. రేణుకా స్వామి అక్కడ పనిచేయడం లేదని తెలిసి పవన్ మరోసారి ఛాటింగ్ లో ప్రశ్నించాడు. నిజమైన వివరాలు చెబితే తాను (పవిత్ర) అతడిని కలుస్తానని చెప్పాడు. అది నమ్మిన రేణుకా స్వామి అన్ని వివరాలు మెసేజ్ చేశాడు.

దర్శన్ కు అసలు విషయం చెప్పిన పవిత్ర.. 
తొలుత ఈ విషయం దర్శన్ కు తెలియకూడదని భావించినా... తర్వాత తనే స్వయంగా దర్శన్ కు చెప్పింది. దీంతో రేణుకా స్వామిని మందలించాలని దర్శన్ భావించాడు. చిత్రదుర్గంలోని తన అభిమానుల సంఘం అధ్యక్షుడు రాఘవేంద్ర సహకారంతో రేణుకాస్వామిని జూన్‌ ఏడో తేదీ రప్పించేందుకు ప్రయత్నించాడు. 

అయితే, అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు. దీంతో జూన్ 8న కొంతమంది అనుచరులను పంపించి రేణుకా స్వామిని కిడ్నాప్ చేయించాడు. దర్శన్ నీతో మాట్లాడాలని పిలిచాడని చెప్పడంతో రేణుకా స్వామి ప్రతిఘటించకుండా వారితో వెళ్లాడు. 

రేణుకా స్వామిని మందలించేందుకే తీసుకొచ్చినా... అతడిని చూశాక కోపం పట్టలేక దర్శన్ అనుచరులతో కలిసి దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలతో రేణుకాస్వామి చనిపోయాడు.

రేణుకా స్వామి చనిపోయాక..
రేణుకా స్వామి చనిపోయిన సమయంలో దర్శన్ తో పాటు పవిత్ర, వారి అనుచరులు రాఘవేంద్ర, అనుకుమార్, రవిశంకర్, జగదీశ్, వినయ్‌ అక్కడే ఉన్నారు. రేణుకా స్వామి చనిపోవడంతో పోలీసులకు లొంగిపోవాలని దర్శన్ సన్నిహితుడు ప్రదోశ్ సూచించాడు. అయితే, దర్శన్ అనుచరుడు రాఘవేంద్ర దీనికి అంగీకరించలేదు. 

రేణుకా స్వామి మృతదేహాన్ని పట్టణగెరె నుంచి కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకువచ్చి పడేశారు. ఆపై దర్శన్ అనుచరులు ముగ్గురు గిరినగర పీఎస్ లో లొంగిపోయారు. 

రేణుకా స్వామి మృతదేహం బయటపడడం, పోలీసుల విచారణలో దర్శన్ అనుచరులు ఆయనను కిడ్నాప్ చేసినట్లు తేలడంతో దర్శన్, పవిత్ర సహా మొత్తం 17 మంది కటకటాల పాలయ్యారు. మూడు నెలలుగా జైలు ఊచలు లెక్కపెడుతున్నారు.

  • Loading...

More Telugu News