ఓటమిని తట్టుకోలేక నా హత్యకు కుట్ర.. కాటసానిపై టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
- మాజీ ఎమ్మెల్యే కాటసానిపై జిల్లా ఎస్పీకి నంద్యాల టీడీపీ అధ్యక్షుడి ఫిర్యాదు
- తన కుమారుడు, అనుచరులతో కలిసి హత్యకు కుట్ర పన్నుతున్నారని ఆరోపణ
- ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం
- టీడీపీ అభ్యర్థి విజయం కోసం తాను పాటుపడ్డందుకు ఆగ్రహంగా ఉన్నారని వ్యాఖ్య
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుసేనాపురానికి చెందిన మల్లెల రాజశేఖర్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి శనివారం పోలీసు కార్యాలయంలో ఎస్పీని కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవడాన్ని కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆయన కుమారుడు శివనర్సింహారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని రాజశేఖర్ చెప్పారు. యువగళం పాదయాత్ర సమయంలో లోకేశ్ను విమర్శిస్తూ కాటసాని రాంభూపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తాను స్పందించానన్నారు. లోకేశ్ను దూషిస్తే నాలుక కోస్తానని ప్రకటన ఇచ్చానని, అప్పటి నుంచి కాటసాని తనపై ద్వేషం పెంచుకున్నారన్నారు. పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి విజయానికి కృషి చేయడాన్ని ఓర్వలేక కుట్రలు చేస్తున్నారంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.