రెండు జాతీయ పార్టీల్లో మంచోళ్లున్నారు.. అసమర్థులూ ఉన్నారంటూ సెహ్వాగ్ సంచలన కామెంట్
- ఇండియా పేరును భారత్గా మార్చే విషయాన్ని రాజకీయం చేయడం హాస్యాస్పదమన్న మాజీ క్రికెటర్
- తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదన్న సెహ్వాగ్
- మన దేశాన్ని భారత్ అని పిలిస్తే సంతోషంగా ఉంటుందని వ్యాఖ్య
‘మన దేశాన్ని భారత్ అని సంబోధించాలని ప్రజలు కోరుకోవడం రాజకీయ అంశంగా భావించడం తమాషాగా అనిపిస్తుంది. నేను ఏ ప్రత్యేక రాజకీయ పార్టీకి అభిమానిని కాదు. నాకు ఎప్పుడూ ఎలాంటి రాజకీయ ఆకాంక్షలు లేవని మరోసారి స్పష్టం చేస్తున్నా. నాకు అలాంటి ఆలోచన ఉండి ఉంటే రెండు జాతీయ పార్టీల నుంచి గత లోక్ సభ ఎన్నికల సమయంలో వచ్చిన ఆఫర్లను సంతోషంగా అంగీకరించి ఉండేవాడిని. అవసరమైతే ఏ పార్టీ నుంచి అయినా టిక్కెట్ పొందడానికి మైదానంలో సాధించిన విజయాలు సరిపోతాయి. ఇక్కడ మనస్పూర్తిగా మాట్లాడటం వేరు. రాజకీయ ఆకాంక్ష వేరు’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
తన వరకు భారత్పైనే తన మనసంతా ఉందన్నాడు. ‘ప్రతిపక్షాల కూటమి తమను తాము ఇండియా అని పిలుచుకునే విషయానికి వస్తే, వారు తమను తాము భారత్ అని పిలుచుకోవచ్చు, దానికి తగిన ఫుల్ ఫామ్ ను సూచించగల సృజనాత్మక వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ కూడా భారత్ జోడో యాత్ర పేరుతో యాత్ర చేసింది. దురదృష్టవశాత్తూ చాలా మంది భారత్ అనే పదం గురించి అసురక్షితంగా భావిస్తున్నారు. నా దృష్టిలో కూటమి పేరుతో సంబంధం లేకుండా, మోదీ వర్సెస్ ప్రతిపక్ష నేతల మధ్య ఎన్నికలు జరుగుతాయి. అందులో ఉత్తమమైనదే గెలవాలని ఆశిస్తున్నా. మనల్ని ఒక దేశంగా భారత్ అనే పేరుతో సంబోధిస్తే అది నాకు చాలా ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.