భారీగా పాక్ ఎండు ఖర్జూరం పట్టివేత.. యూఏఈ మీదుగా భారత్‌కు అక్రమ రవాణా

భారీగా పాక్ ఎండు ఖర్జూరం పట్టివేత.. యూఏఈ మీదుగా భారత్‌కు అక్రమ రవాణా

  • యూఏఈ మీదుగా భారత్‌లోకి పాక్ ఎండు ఖర్జూరాల అక్రమ రవాణా
  • నాసిక్‌లో 362 టన్నుల సరుకును స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ
  • పాక్ నుంచి దిగుమతులపై ఉన్న నిషేధాన్ని ఉల్లంఘించిన వైనం
  • ముంబై సంస్థపై కేసు నమోదు చేసి అధికారుల దర్యాప్తు
పాకిస్థాన్ నుంచి దిగుమతులపై నిషేధం ఉన్నప్పటికీ, అక్రమ మార్గంలో భారత్‌కు తరలిస్తున్న భారీ ఎండు ఖర్జూరాల దందాను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు భగ్నం చేశారు. "ఆపరేషన్ డీప్ మ్యానిఫెస్ట్" పేరుతో చేపట్టిన ఈ చర్యలో భాగంగా మహారాష్ట్రలోని నాసిక్‌లో 362 మెట్రిక్ టన్నులకు పైగా పాక్ ఎండు ఖర్జూరాలను స్వాధీనం చేసుకున్నారు.

ముంబైకి చెందిన ఒక సంస్థ యూఏఈ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు పత్రాలు సృష్టించింది. ఈ క్రమంలో నాసిక్‌లోని అంబాడ్ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్‌కు చేరుకున్న 13 కంటైనర్లను డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. ఈ సరుకు వాస్తవానికి పాకిస్థాన్‌లోని కరాచీ పోర్టు నుంచి యూఏఈలోని జెబెల్ అలీ పోర్టుకు చేరింది. అక్కడ కంటైనర్లు మార్చి, యూఏఈలో తయారైనట్లు నకిలీ పత్రాలు సృష్టించి భారత్‌కు పంపినట్లు అధికారులు గుర్తించారు.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించి దేశ భద్రతకు విఘాతం కలిగించే ప్రయత్నాలను అడ్డుకునేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సదరు దిగుమతి సంస్థపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Advertisement

More Telugu News