ఉగ్రవాదులతో ఆర్మీ చీఫ్‌ను పొగిడించుకుంటున్న పాక్.. తెరవెనుక వ్యూహం ఇదే!

ఉగ్రవాదులతో ఆర్మీ చీఫ్‌ను పొగిడించుకుంటున్న పాక్.. తెరవెనుక వ్యూహం ఇదే!

Pakistan Army Chief praised by terrorists as part of a hidden strategy
  • పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను పొగడాలంటూ ఉగ్రసంస్థలపై సైన్యం ఒత్తిడి
  • లష్కరే చీఫ్ కుమారుడు తల్హా సయీద్ ప్రశంసల వెనుక పాక్ ఆర్మీ వ్యూహం
  • 'ఆపరేషన్ సిందూర్' దెబ్బతో సన్నగిల్లిన నమ్మకాన్ని పెంచుకునే ప్రయత్నం
  • ఉగ్రసంస్థల్లో నాయకత్వ మార్పును తమకు అనుకూలంగా మార్చుకుంటున్న ఐఎస్ఐ
  • భారత్‌తో ఘర్షణ కోసం సైన్యం, ఉగ్రవాదుల భావజాలాన్ని ఏకం చేసే కుట్ర
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌ను ప్రశంసిస్తూ బహిరంగ ప్రకటనలు చేయాలని అక్కడి ఉగ్రవాద సంస్థలపై సైన్యం తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. లష్కరే తోయిబా (LeT) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని భారత నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ చర్యల ద్వారా సైన్యం, ఉగ్రవాదుల భావజాలాన్ని ఏకం చేయాలని పాక్ సైన్యం ప్రయత్నిస్తోందని అధికారులు చెబుతున్నారు.

భారత్, ఐక్యరాజ్యసమితిచే ఉగ్రవాదిగా ప్రకటించబడిన తల్హా సయీద్.. ఇటీవల ఆర్మీ చీఫ్ మునీర్‌ను "పవిత్ర ఖురాన్‌ను కంఠస్థం చేసిన గొప్ప వ్యక్తి" అని పొగడ్తలతో ముంచెత్తాడు. పాకిస్థాన్‌లో విశ్వాసం, భక్తి, జిహాద్‌లను మునీర్ పునరుద్ధరించారని కీర్తించాడు. భారత్‌తో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఘర్షణను సమర్థించుకోవడానికే ఉగ్రనేతలతో పాక్ సైన్యం ఇలాంటి ప్రకటనలు చేయిస్తోందని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.

'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత ఏజెన్సీలు జరిపిన రహస్య ఆపరేషన్లలో పలు ఉగ్రవాద శిబిరాలు, వాటి మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఇది మునీర్ నాయకత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దీంతో పాక్ ప్రజల్లోనే కాకుండా, ఉగ్రవాద సంస్థల్లోనూ ఆయన నాయకత్వ సామర్థ్యంపై ప్రశ్నలు మొదలయ్యాయి. ముఖ్యంగా జైషే మహమ్మద్ (JeM) వంటి సంస్థలు తమను రక్షించడంలో పాక్ సైన్యం విఫలమైందని భావిస్తూ, ఆర్మీపై నమ్మకాన్ని కోల్పోయాయి.

ఈ నేపథ్యంలోనే దెబ్బతిన్న ప్రతిష్ఠ‌ను కాపాడుకోవడానికి, ఉగ్రసంస్థల్లో తగ్గిపోయిన రిక్రూట్‌మెంట్లను పెంచుకోవడానికి పాక్ సైన్యం ఈ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రస్తుతం లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థల్లో నాయకత్వ సంక్షోభం నడుస్తోంది. దీనిని సైన్యం తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. లష్కరే తోయిబా పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న తల్హా సయీద్, సైన్యం మద్దతు కోసమే మునీర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నాడని తెలుస్తోంది. ఇదే తరహాలో జైషే మహమ్మద్‌లోనూ తమకు అనుకూలమైన నాయకుడిని నిలబెట్టి, భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను, సైన్యాన్ని ఒకే తాటిపైకి తీసుకురావాలని పాక్ ఆర్మీ యోచిస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Advertisement
Asim Munir
Pakistan Army
Talha Saeed
Lashkar e Taiba
Operation Sindoor
India Pakistan relations

More Telugu News