అమలాపురం మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూత
- గుండెపోటుతో ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- కాంగ్రెస్ తరఫున మూడుసార్లు ఎంపీగా సేవలందించిన నేత
- ‘దళిత వేదం’ పేరుతో పుస్తకాన్ని రాసిన కృష్ణమూర్తి
- కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరం
కృష్ణమూర్తి 1940 సెప్టెంబర్ 11న ఉమ్మడి గోదావరి జిల్లా, అయినవిల్లి మండలం విలస గ్రామంలో జన్మించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన, ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అమలాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మూడుసార్లు పోటీ చేసి విజయం సాధించారు.
1990లో కేంద్ర పెట్రోలియం, రసాయనాల మంత్రిత్వ శాఖలో సేవలు అందించారు. 1980-82 మధ్య కాలంలో షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమ సంయుక్త కమిటీకి కన్వీనర్గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ‘దళిత వేదం’ అనే పుస్తకాన్ని కూడా ఆయన రచించారు. గత కొన్నేళ్లుగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.