ఐపీఎస్ సునీల్ నాయక్కు తాత్కాలిక ఊరట
- రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్కు ఊరట
- తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు నుంచి మినహాయింపు
- ఈ నెల 22 వరకు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాల్సిన అవసరం లేదు
- 23న ఉదయం 10 గంటలకు తిరిగి విచారణకు రావాలని ఆదేశించిన హైకోర్టు
- ముందస్తు బెయిల్ పిటిషన్పై 18న వాదనలు విననున్న న్యాయస్థానం
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సునీల్ నాయక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గురువారం ఈ పిటిషన్పై విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్. అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాల మేరకు సునీల్ నాయక్ బుధవారం వరకు దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారని తెలిపారు. అయితే, పాట్నాలో ఉన్న తల్లికి అనారోగ్యం తీవ్రమవడంతో ఆయన అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. సునీల్ నాయక్కు ఈ నెల 22 వరకు విచారణకు హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి మార్చి 23న ఉదయం 10 గంటలకు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఇక, ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణార్హతపై ఈ నెల 18న వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది.