20 కోట్ల ఖర్చు .. 200 కోట్ల వసూళ్లు .. మలయాళ మూవీ సంచలనం!
- ఫిబ్రవరి 22న విడుదలైన 'మంజుమ్మెల్ బాయ్స్'
- యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన సినిమా
- రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టిన కంటెంట్
- ఈ నెల 29వ తేదీన తెలుగులో రిలీజ్ చేసే ఛాన్స్
సౌబిన్ షాహిర్ .. బాబు షాహిర్ .. షావన్ ఆంటోని నిర్మించిన ఈ సినిమాకి చిదంబరం దర్శకత్వం వహించాడు. 2006లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ కథ తెరకెక్కింది. కేరళకి చెందిన కొంతమంది విద్యార్థులు, తమిళనాడు ప్రాంతానికి విహారానికి వెళతారు. ఊహించని విధంగా అక్కడి గుహలో వారు చిక్కుకుపోతారు. లోపల వాళ్లు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశారు? ఎలా బయటపడ్డారు? అనేదే కథ.
ఈ సినిమాను 20 కోట్ల రూపాయలతో నిర్మించారు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 200 కోట్ల మార్క్ ను టచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అనుక్షణం ఉత్కంఠను కలిగించే ఈ సినిమాను, మైత్రీ మూవీస్ వారు తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను ఇక్కడి థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. ఇక తెలుగు ఆడియన్స్ నుంచి ఈ సినిమా ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.