Nimmagadda Ramesh Kumar: ప్రభుత్వ సమ్మతితో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం: గవర్నర్ కు లేఖ రాసిన నిమ్మగడ్డ

  • శుక్రవారం అసెంబ్లీలో తీర్మానం
  • ఆర్డినెన్స్ వస్తే తిరస్కరించాలన్న నిమ్మగడ్డ
  • అవసరమైతే నిపుణులను సంప్రదించాలని సూచన
Nimmagadda Ramesh Kumar writes to AP Governor

ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. ప్రభుత్వ సమ్మతితో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, ఒకవేళ అలాంటి ఆర్డినెన్స్ వస్తే తిరస్కరించండి అని తన లేఖలో విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ వ్యతిరేకం అని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో చేసిన తీర్మానం ఆధారంగా ఆర్డినెన్స్ తెచ్చే అవకాశముందని, ఒకవేళ ఆర్డినెన్స్ వస్తే ఎస్ఈసీ అధికారాలు, ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-కె ప్రకారం ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి ఉందని, కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి అధికారాలు ఉంటాయో, అందుకు సమానమైన అధికారాలే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఉంటాయని నిమ్మగడ్డ తన లేఖలో వివరించారు.

ఐదేళ్లకోసారి ఎన్నికలు జరపడం ఎన్నికల కమిషన్ విధి అని, అలాకాకుండా ప్రభుత్వ అంగీకారం మేరకే ఎన్నికల తేదీలు ప్రకటించాలన్న ఆర్డినెన్స్ వస్తే దాన్ని తిప్పి పంపాలని సూచించారు. అవసరమైతే రాజ్యాంగ, న్యాయనిపుణులను సంప్రదించాలని తెలిపారు.

More Telugu News