దళితుల భూముల్లో అంగుళం కూడా తీసుకోం.. ఆయన మాటలు నమ్మొద్దు: మంత్రి పొంగులేటి

దళితుల భూముల్లో అంగుళం కూడా తీసుకోం.. ఆయన మాటలు నమ్మొద్దు: మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy says government will not take an inch of Dalit land
  • కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణ నేపథ్యంలో దళిత రైతులకు నోటీసులు 
  • దళితుల భూములపై మంత్రి పొంగులేటి భరోసా 
  • భూ రికార్డుల పరిశీలన హక్కుల పరిరక్షణకేనని, భూసేకరణ కాదని వివరణ
  • కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
  • దళితులు, గిరిజనుల భూ హక్కులకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ 
రాష్ట్రంలోని దళితుల భూముల్లో అంగుళం కూడా ప్రభుత్వం తీసుకోదని, వారి భూములకు పూర్తి భద్రత కల్పిస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం స్పష్టం చేశారు. దళితులు, గిరిజనుల భూములను లాక్కోవడం ప్రజల ప్రభుత్వ విధానం కాదని ఆయన తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం దళితుల భూములకు పూర్తి రక్షణ కవచంగా నిలుస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.

దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ఆశీస్సులతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని పొంగులేటి పేర్కొన్నారు. సామాజిక న్యాయం, పేదల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రధాన ప్రాధాన్యతలని అన్నారు. భూసంస్కరణలు, భూ పంపిణీ వంటి చారిత్రక నిర్ణయాలతో నిరుపేద దళితులకు భూములు ఇచ్చి హక్కులు కల్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో సుమారు 25 లక్షల ఎకరాల భూమిని దళితులకు, 2 లక్షల ఎకరాల పోడు భూములను గిరిజనులకు పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేసిన 'దొర' కేసీఆర్ మాటలను నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌పై విచారణ జరుపుతామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో ఈ వివాదం మొదలైంది. ఈ ఫామ్‌హౌస్ దాదాపు 700 ఎకరాల్లో విస్తరించి ఉందని, అందులో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎర్రవల్లి గ్రామానికి చెందిన 120 మంది దళిత రైతులకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన పత్రాలతో హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొనడంతో దళితుల్లో ఆందోళన మొదలైంది.

ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. "ప్రభుత్వం మీ భూమిలో అంగుళం కూడా తీసుకోదు. మీ భూములను స్వాధీనం చేసుకునే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. మీ భూముల విషయంలో ఎలాంటి భయం, ఆందోళన అవసరం లేదు. ప్రజల ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది" అని దళితులకు భరోసా ఇచ్చారు. భూ రికార్డుల పరిశీలన, సర్వే, భూ సమస్యల పరిష్కారం వంటి ప్రక్రియలను భూములు లాక్కోవడంగా చూడటం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రజల భూ హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, వివాదాలను పరిష్కరించడం, వారి హక్కులకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

కొంతమంది శక్తిమంతమైన వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దళితులను రెచ్చగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారని మంత్రి ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్య చట్టబద్ధంగా, పారదర్శకంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Ponguleti Srinivas Reddy
Telangana Revenue Minister
Dalit Land Protection
Revanth Reddy Government
Erravelli Farmhouse Issue
K Chandrashekar Rao

More Telugu News