ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: అయ్యన్నపాత్రుడు

Chintakayala Ayyanna Patrudu announces retirement from politics and next elections
  • రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు అయ్యన్న ప్రకటన
  • వయసు పైబడటం వల్ల విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని వెల్లడి
  • ఈ మూడేళ్ల కాలంలో తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తానన్న అయ్యన్న

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన ప్రకటన చేశారు. తాను ఇకపై రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. నర్సీపట్నంలో జరిగిన తన జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


వయసు పైబడటం వల్ల విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన అయ్యన్న, అసెంబ్లీ స్పీకర్‌గా తనకు మిగిలి ఉన్న మూడేళ్ల పదవీకాలంలో నియోజకవర్గంలో పనులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడానికి ప్రాధాన్యమిస్తానని ప్రకటించారు. గత 31 ఏళ్లుగా తన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామన్నారు.


మరోవైపు, రేపు (సెప్టెంబరు 6) నర్సీపట్నంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో ‘బీసీ ఐక్య వేదిక సదస్సు’ నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కూటమి ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లు కల్పించి విద్య, ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇస్తుంటే, వైసీపీ మాత్రం బీసీల హక్కులపై రాజకీయం చేస్తూ కుట్రలు పన్నుతోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. వైసీపీ కుట్రలను తిప్పికొట్టేందుకు బీసీ వర్గాలన్నీ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

Advertisement
Chintakayala Ayyanna Patrudu
AP Assembly Speaker
Political Retirement
Narsipatnam
TDP
Andhra Pradesh Elections

More Telugu News