Advertisement

అప్పటివరకు కశ్మీర్‌కు ఎందుకు వెళ్లలేదో చెప్పిన షారుఖ్‌!

Shah Rukh Khan reveals why he did not visit Kashmir for years and the reason is emotional
  • తండ్రి మాట కోసం కశ్మీర్‌ వెళ్లని షారుఖ్‌
  • మూడు ప్రాంతాలు చూడాలని సూచించిన తండ్రి
  • కశ్మీర్‌ను తనతో కలిసి చూడాలని కోరిన షారుఖ్‌ తండ్రి
  • ‘జబ్‌ తక్‌ హై జాన్‌’ కోసం కశ్మీర్‌ వెళ్లిన స్టార్‌ హీరో
  • ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన యశ్‌ చోప్రా
బాలీవుడ్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ ఎన్నో ఏళ్ల పాటు కశ్మీర్‌కు వెళ్లలేదట. దీనికి రాజకీయమో, మరేదైనా కారణమో కాదు. తన తండ్రి చెప్పిన ఓ మాటే ఇందుకు కారణమని షారుఖ్‌ గతంలో వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘కింగ్‌’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ ఈ పాత వీడియో మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో అమితాబ్‌ బచ్చన్‌తో షారుఖ్‌ తన కుటుంబ మూలాల గురించి మాట్లాడాడు. తన నాన్నమ్మ కశ్మీర్‌కు చెందినవారని చెప్పాడు. జీవితంలో ఇస్తాంబుల్‌, ఇటలీలోని రోమ్‌, కశ్మీర్‌ తప్పక చూడాలని తన తండ్రి చెప్పారన్నాడు. అయితే కశ్మీర్‌ను మాత్రం తనతో కలిసి చూడాలని కోరారని తెలిపాడు.

తన తండ్రి చిన్న వయసులోనే చనిపోయారని షారుఖ్‌ చెప్పాడు. ఆ తర్వాత ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాలు తిరిగినా కశ్మీర్‌కు మాత్రం వెళ్లలేదన్నాడు. స్నేహితులు ఆహ్వానించినా, కుటుంబ సభ్యులు విహారయాత్రకు వెళ్లినా తాను మాత్రం వెళ్లలేదని తెలిపాడు.

‘జబ్‌ తక్‌ హై జాన్‌’ సినిమా షూటింగ్‌ కోసం కశ్మీర్‌కు రావాలని దర్శకుడు యశ్‌చోప్రా చెప్పడంతో పరిస్థితి మారిందన్నాడు. మొదట తాను కశ్మీర్‌ వెళ్లేందుకు నిరాకరించానని చెప్పాడు. అయితే అది రాజకీయ కారణం కాదని స్పష్టం చేశాడు. తండ్రితో కలిసి కశ్మీర్‌ను చూడాలన్న భావోద్వేగమే తనను ఇన్నాళ్లు అక్కడికి వెళ్లకుండా చేసిందన్నాడు.

చివరికి యశ్‌చోప్రాతో కలిసి కశ్మీర్‌ వెళ్లడమే సరైన నిర్ణయమని భావించినట్లు షారుఖ్‌ చెప్పాడు. ‘జబ్‌ తక్‌ హై జాన్‌’ యశ్‌చోప్రా దర్శకత్వం వహించిన చివరి సినిమా. 2012లో ఆయన కన్నుమూశాడు. దీంతో ఈ చిత్రం షారుఖ్‌-యశ్‌చోప్రా కలయికలో చివరి సినిమాగా నిలిచింది.
Advertisement
Shah Rukh Khan
Kashmir
Yash Chopra
Jab Tak Hai Jaan
SRK Father
Bollywood News

More Telugu News