జర్నలిస్టు అవార్డుల పేర్లు మార్చిన ఏపీ ప్రభుత్వం.. కొత్త పేర్లు ఇవే!

Andhra Pradesh Government changes journalist award names here are the new names
  • జర్నలిస్టు అవార్డుల పేర్లను సవరిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు
  • కొన్ని పేర్లపై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం
  • ఉత్తమ మహిళా జర్నలిస్టు అవార్డుకు సావిత్రిబాయి ఫూలే పేరు ఖరారు
  • ఉత్తమ ఫొటో జర్నలిస్టు, గ్రామీణ జర్నలిస్టు అవార్డుల పేర్లు కూడా మార్పు
  • కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు పేరుతో ఉత్తమ జర్నలిస్టు అవార్డు
ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులకు అందించే పలు పురస్కారాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నిర్ణయించిన కొన్ని అవార్డుల పేర్లపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఆ మేరకు నిన్న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పుల ద్వారా పలువురు ప్రముఖుల పేర్లను ఈ పురస్కారాలకు జత చేసింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సవరించిన అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి: బి. నాగేశ్వరరావు ఉత్తమ జర్నలిస్టు అవార్డు పేరును "కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఉత్తమ జర్నలిస్టు అవార్డు"గా మార్చారు. ఎం.ఏ. రహీమ్ ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డు స్థానంలో "కొక్కు అహోబలరావు ఉత్తమ ఫొటో జర్నలిస్టు అవార్డు" అని పేరు మార్పు చేశారు. ఖాసా సుబ్బారావు, ఎం. నర్సింగరావు, షోయబుల్లా ఖాన్ ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డుల పేర్లను "ఖాసా సుబ్బారావు, ముట్నూరి కృష్ణారావు, మద్దుకూరి చంద్రశేఖరరావు ఉత్తమ గ్రామీణ జర్నలిస్టు అవార్డులు"గా సవరించారు.

ఉత్తమ మహిళా జర్నలిస్టు అవార్డుకు ప్రముఖ సంఘ సంస్కర్త "సావిత్రిబాయి ఫూలే ఉత్తమ మహిళా జర్నలిస్టు అవార్డు"గా నామకరణం చేశారు. ఉత్తమ ఉర్దూ జర్నలిస్టు అవార్డు పేరును "అబ్దుల్ కలాం ఆజాద్ ఉత్తమ ఉర్దూ జర్నలిస్టు అవార్డు"గా మారుస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఇకపై ఈ నూతన పేర్లతోనే పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.                                
Advertisement
Andhra Pradesh Government
Journalist Awards Renaming
Kasinathuni Nageswararao Pantulu
Savitribai Phule Award
AP Media Awards
Journalism Awards AP

More Telugu News