రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు బ్రేక్.. కేంద్రంపై ఖర్గే ఫైర్

Revanth Reddy US tour break Kharge slams Central Government
  • సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణ
  • కేంద్రం కావాలనే ఈ నిర్ణయం తీసుకుందని ఖర్గే ఆరోపణ
  • పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలను అడ్డుకోవడం తగదన్న కాంగ్రెస్ చీఫ్
  • ఈ చర్య వల్ల రాష్ట్రానికే కాక దేశానికి కూడా నష్టమని విమర్శ
  • తమకు నచ్చినవారికే కేంద్రం అనుమతులు ఇస్తోందని ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగాల్సిన ఈ పర్యటనను కేంద్రం ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందని ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఖర్గే, విదేశీ పర్యటనల ద్వారా ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆహ్వానిస్తారని పేర్కొన్నారు. "అమెరికాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు అత్యధిక సంఖ్యలో నివసిస్తున్నారు. రాష్ట్రాల్లో పరిశ్రమల స్థాపనకు వారిని ఆహ్వానించేందుకే ముఖ్యమంత్రులు ఇటువంటి పర్యటనలు చేపడుతుంటారు. అలాంటి కీలక పర్యటనకు అనుమతి నిరాకరించడం అన్యాయం" అని ఆయన మండిపడ్డారు.

"కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన వారికి తక్షణమే అనుమతులు మంజూరు చేస్తోంది, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి విషయంలో మాత్రం వివక్ష చూపుతోంది" అని మల్లికార్జున ఖర్గే ఆక్షేపించారు. విదేశీ పెట్టుబడులు రావడం వల్ల రాష్ట్రంతో పాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుందని, తద్వారా భారీగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, రాష్ట్రాలకు లభించే పెట్టుబడులు అంతిమంగా దేశాభివృద్ధికి తోడ్పడతాయని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి కీలక పర్యటనలను అడ్డుకోవడం ద్వారా తెలంగాణ ప్రగతికి విఘాతం కలిగించేలా కేంద్రం వ్యవహరించడం సరికాదని మల్లికార్జున ఖర్గే హితవు పలికారు.
Advertisement
Revanth Reddy
Mallikarjun Kharge
Telangana CM US Tour
Central Government
Telangana Investments
Congress vs BJP

More Telugu News