ఎన్నికల ప్రచారంలో పావురం ఎగురవేసిన విజయ్... ‘పెటా’ లేఖ
- విజయ్ పార్టీ ప్రచారంలో పావురాలను వాడటంపై ‘పెటా’ అభ్యంతరం
- పావురాలకు పార్టీ రంగులు పూసి ఎగరేయడంపై విమర్శలు
- ఇది ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధమని ‘పెటా’ ఆరోపణ
- విజయ్కు లేఖ రాసి, జంతు హింసను ఆపాలని కోరిన సంస్థ
- మిగిలిన పక్షులను పునరావాసానికి అప్పగించాలని విజ్ఞప్తి
ప్రచారంలో జంతువులను వాడకూడదని 2012లోనే భారత ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని పెటా గుర్తుచేసింది. ప్రచార నియమావళి కింద జంతు సంరక్షణ చట్టాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. "జంతువులకు రాజకీయాలతో సంబంధం లేదు. పావురాలకు రంగులు వేయడం, జనసమూహంలో వాటిని ఎగరేయడం వల్ల అవి తీవ్రమైన ఒత్తిడికి, అనారోగ్యానికి గురవుతాయి. కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది" అని ‘పెటా’ ఇండియా సీనియర్ పాలసీ అడ్వైజర్ విక్రమ్ చంద్రవంశీ పేర్కొన్నారు.
ఈ చర్య 1960 జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని లేఖలో పేర్కొంది. వెంటనే ఈ పద్ధతిని ఆపివేయాలని, పార్టీ వద్ద ఇంకా ఏవైనా పక్షులు ఉంటే వాటిని పునరావాసం కోసం అప్పగించాలని విజయ్ను కోరింది. భవిష్యత్తులో ప్రచార కార్యక్రమాల్లో జంతువులను ఉపయోగించబోమని పార్టీపరంగా స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కూడా ‘పెటా’ విజ్ఞప్తి చేసింది.