అసెంబ్లీలో "జై అమరావతి" నినాదాలు చేసిన మంత్రి నారా లోకేశ్
- అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానానికి మద్దతుగా మాట్లాడిన లోకేశ్
- రాజధానిపై జగన్ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్
- మూడు ముక్కలాట ఆడి ప్రజలను మోసం చేశారని విమర్శ
- రాష్ట్ర ప్రజలకు, రైతులకు జగన్ క్షమాపణ చెప్పాలని వ్యాఖ్య
- ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని తమ ప్రభుత్వ విధానమని స్పష్టీకరణ
రాజధానిగా అమరావతే ఉంటుందని అబద్ధం చెప్పి ముఖ్యమంత్రి అయ్యాక జగన్ మూడు ముక్కలాట ఆడారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన అంశంపై సభలో చర్చ జరుగుతుంటే జగన్ బెంగళూరులో ఉండటాన్ని లోకేశ్ తప్పుబట్టారు. ఇది వ్యక్తిగత విషయం కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు సంబంధించినదని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో అమరావతి రైతులు చేసిన ఆందోళనలకు సంబంధించిన ఫొటోలను లోకేశ్ సభలో ప్రదర్శించారు. ప్రజలను, రైతులను మోసం చేసినందుకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 'ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ' తమ ప్రభుత్వ విధానమని లోకేశ్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అమరావతి రాజధాని తీర్మానానికి తాను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు.