'రాజా సాబ్' ఈవెంట్లో రచ్చ.. నటి నిధి అగర్వాల్కు చేదు అనుభవం
- కారు ఎక్కుతుండగా ఆమెను చుట్టుముట్టిన అభిమానులు
- బౌన్సర్ల సాయంతో సురక్షితంగా బయటపడ్డ నటి
- ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, భద్రతపై చర్చ
- ఈవెంట్ నిర్వాహకుల తీరును తప్పుపట్టిన నెటిజన్లు
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సెలబ్రిటీల భద్రత, ఈవెంట్ నిర్వహణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీడియోలలో, జనసమూహం మధ్య నుంచి తన వాహనం వైపు వెళ్లేందుకు నిధి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు కారులోకి ఎక్కిన వెంటనే ఆమె ఊపిరి పీల్చుకుని "దేవుడా, ఏంటిది అసలు?" అని వ్యాఖ్యానించింది.
ఈ ఘటనపై పలువురు నెటిజన్లు, ప్రముఖులు స్పందించారు. గాయని చిన్మయి శ్రీపాద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "హైనాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్న మగవాళ్ల గుంపు. ఇది వేధింపు కాదా?" అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మరోవైపు, ఈవెంట్ నిర్వాహకుల తీరును కూడా పలువురు తప్పుపట్టారు. "తప్పు జనాలది కాదు, సినిమా టీమ్దే. ఇంత చిన్న ప్రదేశంలో ఈవెంట్ ఎలా ప్లాన్ చేస్తారు? ఇది చాలా పేలవమైన నిర్వహణ" అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. "వీళ్లు అభిమానులు కాదు, అభిమానుల ముసుగులో ఉన్న రాబందులు" అంటూ మరికొందరు మండిపడ్డారు.
ప్రస్తుతానికి ఈ ఘటనపై నిధి అగర్వాల్ కానీ, 'ది రాజా సాబ్' చిత్ర బృందం కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ చిత్రంలో సంజయ్ దత్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది.