విషాదంలో కోలీవుడ్.. ప్రముఖ కమెడియన్ రోబో శంకర్ కన్నుమూత
- కొంతకాలంగా కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధ
- పచ్చకామెర్లు సోకడంతో ఆరోగ్యం విషమించి కన్నుమూత
- చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస
- నేడు చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్న కుటుంబ సభ్యులు
- నటుడి మృతిపై కమల్ హాసన్ తీవ్ర భావోద్వేగం
గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రోబో శంకర్కు ఇటీవల పచ్చకామెర్లు సోకాయి. దీంతో ఆయన పరిస్థితి మరింత క్షీణించింది. గురువారం ఇంట్లో స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయనకు భార్య ప్రియాంక, కుమార్తె ఇంద్రజ ఉన్నారు. ఇంద్రజ కూడా ‘బిగిల్’ చిత్రంతో నటిగా పరిచయమయ్యారు.
స్టాండప్ కమెడియన్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శంకర్, ‘కలక్క పావతు యారు’ అనే టెలివిజన్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రోబోలా డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించడంతో ఆయనకు ‘రోబో శంకర్’ అనే పేరు స్థిరపడింది. ‘మారి’, ‘విశ్వాసం’ వంటి అనేక చిత్రాల్లో తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను మెప్పించారు. ‘సొట్టా సొట్టా ననైయుతూ’ ఆయన నటించిన చివరి చిత్రం.
రోబో శంకర్ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం చెన్నైలోని ఆయన నివాసంలో ఉంచారు. ఆయన అంత్యక్రియలు ఈ రోజు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కమల్ హాసన్ భావోద్వేగ నివాళి
రోబో శంకర్ మృతిపై అగ్ర నటుడు కమల్ హాసన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "రోబో అనేది నీకు మారుపేరే కానీ, నువ్వు మనసున్న గొప్ప మనిషివి. నా చిన్న తమ్ముడిలాంటి వాడివి. నీ పని ముగిసిందని వెళ్లిపోతున్నావేమో, కానీ నా పని ఇంకా మిగిలే ఉంది. రేపు నువ్వు మమ్మల్ని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ ఆ రేపటి రోజు మాది" అంటూ కమల్ సోషల్ మీడియాలో నివాళులర్పించారు.