మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట
- మిథున్ రెడ్డికి జైలులో ప్రత్యేక సదుపాయలకు ఆదేశాలు జారీ చేసిన కోర్టు
- రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి
- వెస్ట్రన్ కమోడ్తో ఉన్న ప్రత్యేక గది ఏర్పాటుతో పాటు ఇతర సౌకర్యాలకు ఆదేశాలు
జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కోరుతూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరిపి కీలక ఆదేశాలు వెలువరించింది. జైలులో ప్రత్యేక వసతుల కల్పనకు కోర్టు అనుమతినిచ్చింది. వెస్ట్రన్ కమోడ్తో కూడిన ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడంతో పాటు ఒక సహాయకుడు, అవసరమైన మందులు, మంచం, దుప్పటి, దిండు, వాటర్ బాటిల్స్, కూలర్, పేపర్, పెన్ను, టేబుల్, ప్రొవిజన్ ఉంటే టీవీని అనుమతించాలని కోర్టు పేర్కొంది. పేపర్, వాటర్ బాటిల్స్, ఆహారం ఖర్చును మిథున్ రెడ్డి భరించాలని స్పష్టం చేసింది.
బయటి నుంచి ఆహారం తీసుకువస్తే అండర్ టేకింగ్ లెటర్ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. జైలులో వైద్య వసతి కల్పించాలని, అవసరమైతే జైలు బయట వైద్య సౌకర్యం కల్పించాలని సూచించింది. ఇద్దరు న్యాయవాదులు, బంధువులతో మూడు సార్లు ములాఖత్లకు కోర్టు అనుమతినిచ్చింది.