17 ఏళ్ల విడాకుల పోరుకు ముగింపు: భార్యకు రూ. 50 లక్షలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం!
- దాదాపు రెండు దశాబ్దాల న్యాయపోరాటం తర్వాత దంపతులకు విడాకులు
- మూడు నెలల్లోపు నగదు చెల్లిస్తే.. భర్త ఆస్తిపై భార్యాబిడ్డలకు మరే ఇతర హక్కులు ఉండవన్న న్యాయస్థానం
- 17 ఏళ్లుగా విడివిడిగా ఉంటున్నందున, ఇక కలిసి ఉండే అవకాశం లేదని కోర్టు నిర్ధారణ
ఈ వివాదంపై విచారణ జరిపిన జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ నర్సింగ్ రావు నందికొండలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దంపతుల మధ్య తీవ్రమైన అపనమ్మకం ఉందని, ఇన్నేళ్లు విడివిడిగా ఉన్నాక వారిని బలవంతంగా కలిపి ఉంచడం వల్ల ప్రయోజనం లేదని అభిప్రాయపడింది. ఇది తిరిగి కోలుకోలేని వివాహ బంధమని పేర్కొంటూ విడాకులు మంజూరు చేసింది.
భార్య, కుమార్తె భవిష్యత్తు అవసరాల కోసం మూడు నెలల వ్యవధిలో రూ. 50 లక్షలు ఏకమొత్తంగా చెల్లించాలని భర్తను న్యాయస్థానం ఆదేశించింది. ఈ మొత్తాన్ని చెల్లించిన తర్వాత, భర్తకు సంబంధించిన ఆస్తులు లేదా ఇతర ఆర్థిక లావాదేవీలపై భార్యకు గానీ, కుమార్తెకు గానీ ఎటువంటి హక్కులు ఉండవని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.